ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంపై హైకోర్టుకు వైసీపీ?

ఏపీ అసెంబ్లీకి సంబంధించి గ‌త రెండు రోజులుగా రాజ‌కీయాలు జ‌రుగుతున్నాయి. సంఖ్యాబ‌లం లేనందున వైసీపీకి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదా ఇచ్చేది లేద‌ని అధికార ప‌క్షం చెబుతోంది. అయితే.. సంఖ్యాబ‌లంతో సంబంధం లేకుండా.. గ‌తంలో ప్ర‌తిప‌క్ష హోదా ఇచ్చిన ప‌రిస్థితులు దేశంలోను, రాష్ట్రంలోనూ ఉన్నాయంటూ.. వైసీపీ అధినేత జ‌గ‌న్ చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ఆయా సంద‌ర్భాల‌ను ఉటంకిస్తూ.. ఆయ‌న స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడిలేఖ రాశారు. అయిన‌ప్ప‌టికీ.. అధికార ప‌క్షం మెట్టు దిగే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నందున హోదా ఇవ్వ‌లేమ‌ని.. జ‌గ‌న్‌ను కేవ‌లం ఫ్లోర్ లీడ‌ర్‌గానే గుర్తిస్తామ‌ని తాజాగా స‌భా వ్య‌వ‌హారాల మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ చెప్పుకొచ్చారు. ఇక‌, దీనిపై స్పీక‌ర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నేది వేచి చూడాలి. అయితే.. త‌మ‌కు వ్య‌తిరేకంగా క‌నుక‌.. స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకుంటే.. దీనిని హైకోర్టులో స‌వాల్ చేయాల‌ని వైసీపీ భావిస్తున్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాల స‌మాచారం. న్యాయ పోరాటంద్వారా అయితే.. స‌భ‌లో త‌మ గౌర‌వాన్ని తాము నిలుపుకొనేందుకు ఆ పార్టీ అధినేత ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలుస్తోంది. అయితే.. స్పీక‌ర్ నుంచి స‌మాచారం వ‌చ్చాకే దీనిపై నిర్ణ‌యం తీసుకుంటార‌ని తెలిసింది.

న్యాయ పోరాటం సాధ్య‌మేనా?

స‌హజంగా అసెంబ్లీకి సంబంధించిన వ్య‌వ‌హారమైనా.. పార్ల‌మెంటుకు సంబంధించిన వ్య‌వ‌హార‌మైనా.. న్యాయ స్థానాలు జోక్యం చేసుకోవ‌డం అరుదు. అయితే.. చ‌ట్టాలు, నిబంధ‌న‌లు పాటించ‌ని ద‌రిమిలా మాత్రం కోర్టులు జోక్యం చేసుకునేందుకు ప్ర‌జాస్వామ్య స్ఫూర్తిని నిల‌బెట్టేందుకు వెనుకాడాల్సిన అవ‌స‌రం లేద‌ని గ‌త ఏడాది సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. దీంతో కోర్టులు జోక్యం చేసుకునే అవ‌కాశం ఉంది. అప్ప‌ట్లో కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌, ఎంపీ రాహుల్‌ను పార్ల‌మెంటు నుంచి అనర్హ‌త వేటు వేశారు. ఆయ‌న‌పై కేసు న‌మోదు కావ‌డం, రెండేళ్ల‌కు మించి జైలు శిక్ష విధించ‌డంతో ఇలా చేశారు.

అయితే ఈ కేసులో రాహుల్ ఉప‌శ‌మ‌నం పొందారు. దీంతో అన‌ర్హ‌త ఎత్తేయాల‌ని కోరారు. అయిన‌ప్ప‌టికీ.. స్పీక‌ర్ ప‌ట్టించుకోకుండా కాల‌యాపన చేసిన సంద‌ర్భంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్య‌లు చేసింది. ఇక‌, స‌భ‌ల్లో ప్ర‌తిప‌క్ష హోదా వ్య‌వ‌హారానికి సంబంధించి ఎలాంటి నిబంధ‌న‌లు లేవు. ఇంత సంఖ్యాబ‌లం ఉంటే ఇస్తామ‌ని చెప్ప‌డం అనేది కేవ‌లం మాట మాత్ర‌మే త‌ప్ప‌.. చ‌ట్టాలుకానీ, రూల్స్‌కానీ లేవు. పైగా.. “అధికార ప‌క్షం త‌ర్వాత‌.. ప్ర‌తిప‌క్షాలు ఉన్న‌వాటిలో వేటికి ఎక్కువ మంది స‌భ్యులు ఉంటే ఆ పార్టీకి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వాలి” అని పార్ల‌మెంట‌రీ చ‌ట్టం చెబుతోంది.

ఈ ర‌కంగా చూసుకుంటే.. టీడీపీ కూట‌మి పార్టీల త‌ర్వాత‌.. స‌భ‌లో వైసీపీకి మాత్ర‌మే 11 మంది స‌భ్యుల బ‌లం ఉంది. దీంతో ఈ పార్టీకి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ఇవ్వాలి. ఈ విష‌యంలోనే వివాదం ఏర్ప‌డిన నేప‌థ్యంలో న్యాయ పోరాటం చేయాల‌న్న‌ది వైసీపీ వ్యూహం. మ‌రి స్పీక‌ర్ తీసుకునే నిర్ణ‌యాన్ని బ‌ట్టి ఈ పార్టీ ముందుకు సాగ‌నుంది.