వైసీపీ తొలి అడుగు.. మోడీ వైపా, రాహుల్ వైపా!?

ఏపీలో చిత్తుగా ఓడిపోయిన వైసీపీ.. ప్రాధాన్యం కోల్పోయింది. అయితే.. ఇది రాష్ట్ర స్థాయిలో! కానీ, జాతీయ స్థాయిలో చూసుకున్న‌ప్పుడు మాత్రం వైసీపీకి కొంత మేర‌కు ప్రాధాన్యం ఉంది. న‌లుగురు ఎంపీలు ద‌క్కారు. నిజానికి ఇద్ద‌రు ఎంపీల‌ను ద‌క్కించుకున్న పార్టీలు కూడా.. ప్రాధాన్యం నిల‌బెట్టుకుంటున్నాయి. కేంద్రంలోని జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలు వీరిని త‌మ‌కు సాధ్య‌మైనంత ఎక్కువ‌గా ఆక‌ర్షించే ప‌నిలో ఉన్నాయి. తాజాగా లోక్‌స‌భ స్పీక‌ర్ వివాదం తెర‌మీదికి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. సంప్ర‌దాయాల‌కు భిన్న‌మైన రీతిలో తొలిసారి పార్ల‌మెంటులో ఎన్నిక జ‌రుగుతోంది.

ఒక‌వైపు.. బీజేపీ నాయ‌కుడు(ఎన్డీయే కూట‌మి), మాజీ స్పీక‌ర్ ఓం బిర్లా, మ‌రో వైపు.. కాంగ్రెస్ నేత‌, కేర‌ళ‌కు చెందిన కె. సురేష్ లు స్పీక‌ర్ ప‌ద‌వి కోసం పోటీ ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం నిర్వ‌హించే ఎన్నిక ప్ర‌క్రియ ఆద్యంతం ఇంపార్లెంట్‌గా మారింది. ఇక్క‌డ ఎన్డీయే కూట‌మి ఓడిపోక‌పోవ‌చ్చు. కానీ, ఎన్నిక జ‌ర‌గ‌డం ద్వారా. ఆ పార్టీని ఇరుకున పెట్టాల‌నేది కాంగ్రెస్ కూట‌మి ల‌క్ష్యం. అయితే..ఈ క్ర‌మంలో ఒక్క ఎంపీ స్థానం ఉన్న పార్టీకి కూడా ప్రాధానం ద‌క్కుతోంది. ‘మీ ఓటు ఎటు?’ అంటూ రెండు కూట‌ములు ఫోన్లుచేస్తున్నాయి. అటు ఎన్డీయే, ఇటు ఇండియా కూట‌ముల్లో లేని పార్టీల‌కు.. ఉదాహ‌ర‌ణ‌కు వైసీపీ వంటివి ఎటు ఉంటాయ‌నేది ఆస‌క్తిగా మారింది.

ఇలా చూసుకుంటే.. పార్ల‌మెంటులో వైసీపీ తొలి అడుగు ఎటు వేస్తుంది? అనేది ఉత్కంఠ‌కు దారితీసింది. నిజానికి ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. న‌లుగురు ఎంపీలు మాత్ర‌మే గెలిచిన త‌ర్వాత జ‌గ‌న్ ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త ఇచ్చారు. బీజేపీ వెళ్లి చంద్ర‌బాబుతో చేతులు క‌లిపి త‌మ‌ను ఓడించింద‌ని ఆయ‌న చెబుతూనే.. పార్ల‌మెంటుకు వ‌చ్చే స‌రికి మాత్రం.. త‌మ ప్రాధాన్యం మోడీకేన‌ని అన్నారు. దీంతో ఇప్పుడు పార్ల‌మెంటు స్పీక‌ర్ ఎన్నిక స‌మ‌యంలో వైసీపీ మోడీకి అనుకూలంగానే ఓటు వేస్తుంద‌ని భావించ‌వ‌చ్చు. కానీ, ఇక్క‌డే బిగ్ ట్విస్ట్ తెర‌మీదికి వ‌చ్చింది.

వైఎస్ కుటుంబానికి స‌న్నిహితంగా ఉన్న క‌ర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ తాజాగా జ‌గ‌న్‌తో భేటీ అయిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. “మీ న‌లుగురు మావైపు ఉండేలా చూడండి” అని డీకే అభ్య‌ర్థించిన‌ట్టు తెలిసింది. దీంతో జ‌గ‌న్ ఎటు ఉంటారంటూ.. జాతీయ మీడియా కూడా వ్యాఖ్య‌లు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. కానీ, జ‌గ‌న్‌పై ఉన్న కేసులు.. ప్ర‌స్తుత ప‌రిస్థితిలో త‌న‌కు ర‌క్ష‌ణ వంటివి చూసుకుంటే మోడీ వైపే జ‌గ‌న్ ఎంపీలు అడుగులు వేయ‌డం ఖాయ‌మ‌ని.. ఎన్డీయే కూట‌మి బ‌ల‌ప‌రిచిన స్పీక‌ర్ ఓం బిర్లాకే ఓటేయొచ్చ‌ని జాతీయ మీడియా చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.