అంద‌రినీ దూరం చేసుకుని.. ఒంటరైన జ‌గ‌న్‌!

బ‌తికి ఉన్న‌ప్పుడు ఎలా ఉన్నా.. క‌నీసం పోయేనాటికైనా  న‌లుగురిని సంపాయించుకోవాల‌ని పెద్ద‌లు చెబుతారు. క‌ష్ట‌మైనా.. ఇష్ట‌మైనా.. న‌లుగురు అవ‌స‌రం. ఇది వ్య‌క్తిగ‌త జీవితానికే కాదు.. రాజకీయాల‌కు కూడా వ‌ర్తిస్తుంది.

టీడీపీ అధినేత చంద్ర‌బాబు విధానాలు న‌చ్చ‌ని కామ్రెడ్లు కూడా.. క‌ష్ట కాలంలో ఆయ‌న వెంటే ఉన్నారు. టీడీపీ అంటే.. గిట్ట‌ని ఒక‌ప్ప‌టి బీజేపీ నాయ‌కులు కూడా.. ఆయ‌న‌కు క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడు అయ్యో పాపం.. అన్నారు. అలా జ‌ర‌గ‌కుండా ఉండాల్సింద‌ని వ్యాఖ్యానించారు.

దీనికి కార‌ణం.. కుట్ర పూరితంగా.. క‌క్ష‌పూరితంగా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించ‌క‌పోవ‌డంతోపాటు.. ఆయా పార్టీలు చిన్న‌వా.. పెద్ద‌వా .. అన్న‌ది కాకుండా.. పార్టీల‌ను పార్టీలుగా గౌరవించ‌డం వ‌ల్లే సాధ్య‌మైంది. కానీ, ఈ రోజు.. జ‌గ‌న్ కూడా క‌ష్టంలోనే ఉన్నార‌ని వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు.

ఒక‌వైపు.. ఘోర ప‌రాజయం.. మ‌రోవైపు సొంత పార్టీ నాయ‌కుల నుంచి ఈస‌డింపులు.. ఇంకోవైపు.. నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మం టూ.. పార్టీ కార్యాల‌యాల‌ను ప్ర‌భుత్వం కూల్చేస్తుండ‌డం.. వంటివి ఆయ‌న‌ను సుడిగుండంలోకి నెట్టాయి.

ఒక‌ర‌కంగా.. ఇది పెను క‌ష్ట‌మే. పెద్ద భార‌మే. ఒక‌ప్పుడు 151 మంది ఎమ్మెల్యేల‌తో కాల‌ర్ ఎగ‌రేసుకుని తిరిగిన జ‌గ‌న్‌కు ఇప్ప‌డు బిక్కుబిక్కుమ‌నే ప‌రిస్థితి వ‌చ్చింది. మ‌రి ఈ క‌ష్టాన్ని పంచుకునేదెవ‌రు.. ? ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచేదెవ‌రు? ఆయ‌న త‌ర‌ఫున వ‌కాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్న‌దెవ‌రు? అంటే.. ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా లేరు. నిజానికి పార్టీ ఏదైనా.. ఏ పార్టీ కార్యాల‌య అయినా..  కూల్చితే.. వెంట‌నే ఎర్ర జెండాల‌తో రంగంలోకి దిగేది కామ్రెడ్సే. కానీ, ఈ రోజు వారు మాట్లాడ‌డం లేదు.

రాష్ట్రంలో నేత‌ల‌కు ఏ క‌ష్టం వ‌చ్చినా.. మాట్లాడేది మేధావులే. కానీ, నేడు వారు కూడా.. ఎక్క‌డా ముందుకు రావ‌డం లేదు. క‌నీసం.. ఇలా ఎందుకు చేస్తున్నారు? అని అడిగిన వారు కానీ.. జ‌గ‌న్ ఇబ్బందుల్లో ఉన్నాడ‌ని ఓదార్చిన వారు కానీ. క‌నిపించ‌డం లేదు. దీనికి కార‌ణం.. అధికారంలో ఉండ‌గా.. అంద‌రినీ దూరం చేసుకోవ‌డం.

నాకు నేనే.. మీకు మీరే.. అన్న‌ట్టుగా స‌ర్వం స‌హా చ‌క్ర‌వ‌ర్తిగా వ్య‌వ‌హ‌రించిన ఫ‌లితంగా అంద‌రూ దూర‌మ‌య్యారు. ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా బ‌య‌టకు రావ‌డం లేదు.. జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం లేదు. ప్ర‌జ‌లు ఎప్పుడో వ‌దిలేశారు. సో.. ఇవ‌న్నీ..నేటి త‌రం నాయ‌కుల‌కు పాఠాలు.. అంత‌కుమించి.. వైసీపీకి గుణ‌పాఠాలు.