టీడీపీలో ద‌క్క‌ని ప్రియార్టీ.. ఆ యువ నేత‌కు వైసీపీలో ద‌క్కుతోందే!

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిణాలు ఎదుర‌వుతాయో.. నాయ‌కులు సైతం చెప్ప‌లేని ప‌రిస్థితి నేటి రాజ‌కీయాల్లో నెల‌కొంది. ఒక పార్టీలో నేత డ‌మ్మీ కావొచ్చు.. మ‌రో పార్టీలో అదే నాయ‌కుడు తురుపు ముక్క కావొచ్చు. వారి వారి వ్యూహాలు.. వ్యక్తిగ‌త అజెండాలు ఒక పార్టీలో ప‌నిచేసే అవ‌కాశం లేక‌పోవ‌చ్చు.. అలాగ‌ని అస‌లు ఆ నేత‌ల‌నుప‌క్క‌న పెట్ట‌డానికి కూడా వీలు లేదు. ఎందుకంటే అదే నేత‌ల‌ను మ‌రో పార్టీ చ‌క్క‌గా వినియోగించుకోవ‌చ్చు. ఈ ఫార్ములా.. ఇటీవ‌ల కాలంలో ఏపీలో క‌నిపిస్తోంది. తాజాగా.. టీడీపీలో భారం అనుకున్న యువ‌ నాయ‌కుడు వైసీపీలో కీల‌కంగా మారారు.

టీడీపీలో పెద్ద‌గా ప్రాధాన్యం ద‌క్క‌ని నాయ‌కుడికి.. వైసీపీలో అమిత‌మైన ప్రాధాన్యం ద‌క్కుతోంది. ఈ ప‌రిణామం పొలిటిక‌ల్‌గా కీల‌క‌మైన‌ విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానం ఉన్న దేవినేని రాజ‌శేఖ‌ర్ ఉర‌ఫ్ నెహ్రూ వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన దేవినేని అవినాష్‌కు ఏకంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఎన‌లేని ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయ‌న ఎప్పుడు అడిగితే అప్పుడు కాద‌న‌కుండా.. ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ.. అప్పాయింట్‌మెంట్ ఇస్తున్నారు. ఆయ‌న‌తో ముచ్చ‌టిస్తున్నారు. విజ‌య‌వాడ రాజ‌కీయాల‌పై వాక‌బు చేస్తున్నారు. దీంతో అవినాష్‌కు మంచి ఫ్యూచ‌ర్ స‌మీప భవిష్య‌త్తులోనే ఉంద‌నే టాక్ వినిపిస్తోంది.

మ‌రి ఇదే నేత‌.. కాంగ్రెస్‌లోను, టీడీపీలోనూ కొన‌సాగారు. 2014 ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ ఎంపీ అభ్య‌ర్థిగా కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేశారు. అయితే, అప్ప‌ట్లో ఆయ‌న‌కు డిపాజిట్ కూడా రాలేదు. పైగా స్థానిక నాయ‌కులు కూడా క‌లిసిరాలేదు. ఇక‌, త‌ర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగు యువత అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు సైతం చేప‌ట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగారు. 2019లో గుడివాడ నుంచి పోటీ చేసి మ‌రోసారి ఓడిపోవ‌డంతో ఆయ‌నకు ఐర‌న్ లెగ్ అనే ముద్ర వేశారు టీడీపీ నాయ‌కులు. దీంతో ఆశించిన గుర్తింపు రాలేదు స‌రిక‌దా.. ఆయ‌న‌కు ఎస‌రు పెట్టే నాయ‌కులు త‌యార‌య్యార‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి.

అదే స‌మయంలో త‌న‌కు స్వేచ్ఛ కూడా లేద‌ని అవినాష్ ప‌లుమార్లు ఆఫ్ దిరికార్డుగా వాపోయేవారు. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. మాజీ మంత్రి లోకేష్ క‌నుస‌న్న‌ల్లో ప‌నిచేయాల‌ని ఆదేశాలు వ‌చ్చాయ‌ట‌. దీంతో అవినాష్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఆయ‌న కోరుకున్న తూర్పు నియోజ‌క‌వ‌ర్గం బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంతోపాటు.. మంత్రులకు కూడా ద‌క్క‌ద‌ని భావిస్తున్నసీఎం అప్పాయింట్మెంట్ ల‌భిస్తుండడంతో తిరుగులేని నేత‌గా ఆయ‌న మార‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. జ‌గ‌న్ కూడా విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో టీడీపీ క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెక్ పెట్టేందుకు అవినాష్ క‌రెక్ట్ అనే భావ‌న‌తో ఉన్నార‌నే ప్ర‌చారం కూడా సాగుతుండ‌డంగ‌మ‌నార్హం.