ఏపీలో ఉచిత బ‌స్సు.. ఎప్ప‌టి నుంచంటే!

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ అధినేత ప్ర‌క‌టించిన‌ సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల్లో కీల‌క‌మైంది.. మ‌హిళ‌లకు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం. ఇప్ప‌టికే తెలంగాణ‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోంది. దీనినే ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు.. నిర్వ‌హించిన మ‌హానాడులో చంద్ర‌బాబు సూప‌ర్ సిక్స్ పేరుతో ప్ర‌క‌టించిన ఆరు హామీల్లో ఒక‌టిగా చేర్చారు. దీంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ హామీ ఎప్పుడంటూ చ‌ర్చ ప్రారంభ‌మైంది.

చంద్ర‌బాబు కూట‌మి స‌ర్కారు కొలువుదీరి.. ప‌దిహేను రోజులు మాత్ర‌మే కావ‌డంతో ఇప్పుడిప్పుడే.. హామీల ప్ర‌స్తావ‌న తెర‌మీదికి వ‌స్తోంది. వ‌చ్చేనెల 1న పింఛ‌న్ల పెంపు ఉంది. దీనిపై సీఎం చంద్ర‌బాబు క్లారిటీ ఇచ్చారు.

1వ తేదీ న ఖ‌చ్చితంగా పించ‌న్ల‌ను పెంచే ఇస్తామ‌న్నారు. ఒక్కొక్క‌రికీ ల‌బ్ధి దారుల‌కు రూ.7000 చొప్పున పంపిణీ చేయ‌నున్న‌ట్టు ఆయ‌న వివ‌రించారు. అయితే.. ఆర్టీసీ బ‌స్సుల విష‌యంపై మాత్రం సీఎం స్పందించ‌లేదు. దీంతో ఇప్ప‌ట్లో ఉంటుందా? ఉండ‌దా? అనే విష‌యం ఉత్కంఠ‌గా మారింది.

ఈ నేప‌థ్యంలో తాజాగా ర‌వాణా శాఖ మంత్రి, టీడీపీ నాయ‌కుడు.. మెండిప‌ల్లి రాంప్ర‌సాద‌రెడ్డి.. ఉచిత ఆర్టీసీ ప్ర‌యాణంపై కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. నెల రోజుల్లోగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.

ప్ర‌స్తుతం ఉచిత ఆర్టీసీ సేవ‌లు అందిస్తున్న తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌ల్లో ఈ ప‌థ‌కం అమ‌లు తీరుపై అధ్య‌య‌నం చేస్తున్నామ‌న్నారు. ఆయా రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు ఎలా అమ‌లు చేస్తున్నాయ‌నే విష‌యాన్ని కూడా ఆరా తీస్తున్న‌ట్టు తెలిపారు.

వాటిని ప‌రిశీలించుకున్నాక‌.. ఏపీలో ఏ రీతిలో అమ‌లు చేస్తే బాగుంటుంద‌నే విష‌యంపై బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకుని ముఖ్య‌మంత్రి ముందు పెడ‌తామ‌ని.. ఒక మంచి రోజు చూసుకుని.. ఈ కార్య‌క్ర‌మాన్ని సీఎం చేతుల‌మీదుగా ప్రారంభిస్తామ‌న్నారు.

అదే స‌మ‌యంలో ఆర్టీసీ ఉచిత ప్ర‌యాణం కార‌ణంగా.. ఆటో, ట్యాక్సీ రంగాలు దెబ్బ‌తిన‌కుండా కూడా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు. ఎవ‌రి ఉపాధికీ ఇబ్బందులు రాకుండా చూస్తామ‌న్నారు. ఒక్క నెల రోజులు మ‌హిళ‌లు ఓపిక ప‌ట్టాల‌ని ఆయ‌న సూచించారు.