ఢిల్లీ పర్యటన వెనుక హిడెన్ అజెండా ఏంటబ్బా ?

చాలా కాలం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. ఇంత బిజీ సమయంలో ఏకంగా రెండు రోజులు ఢిల్లీలోనే మకాం వేయటమంటే వెనుక ఏదో హిడెన్ అజెండానే ఉందని అనుమానంగా ఉంది. ఎందుకంటే ఒకవైపు రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతోంది. ఆర్థిక ఆపసోపాలుదారుణంగా ఉన్నాయి. మరోవైపు పార్లమెంటు సమావేశాల్లో ప్రధానమంత్రి, హోంమంత్రి తదితర మంత్రులు చాలా బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటి సమయంలో హఠాత్తుగా జగన్ ఢిల్లీకి ఎందుకెళుతున్నట్లు ? పర్యటన వెనుక ప్రభుత్వం తరపున ప్రత్యేకమైన అజెండా ఉన్నట్లు కూడా ఏమీ కనిపించటం లేదు.

అంటే పెండింగ్ ప్రాజెక్టులకు క్లియరెన్సు, లేదా ఎప్పటి నుండో నిధులు విడుదల ఆగిపోవటం, కొత్త ప్రాజెక్టులకు కేంద్రం క్లియరెన్స్ పెండింగ్ లో ఉండటం లాంటివి ప్రత్యేకంగా ఏవీ ఉన్నట్లు కూడా లేదు. మరి ఇటువంటి సమయంలో రెండు రోజుల ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారనగానే కచ్చితంగా హిడెన్ అజెండా ఉందనేందుకు అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏమంటే ఇన్ సైడర్ ట్రేడింగ్ విచారణపై హైకోర్టు బ్రేకులు, దీన్ని సుప్రింకోర్టులో ఏపి ప్రభుత్వం చాలెంజ్ చేయటమే లేటెస్టు పరిణామం. దీనికి అదనంగా అనేక న్యాయపరమైన అంశాలు ఎటూ ఉండనే ఉన్నాయి. ఇక మూడు రాజధానుల అంశం కూడా న్యాయపరమైన వివాదాల్లో ఇరుక్కుంది.

ఒక విధంగా చూస్తే రాజధాని విశాఖపట్నంకు తరలించటానికి కేంద్రం పరంగా చూస్తే గట్టి మద్దతుగానే ఉన్నట్లు అనిపిస్తోంది. రాజధాని అంశం మొత్తం రాష్ట్రప్రభుత్వం చేతిలోని అంశమే అని మూడుసార్లు అఫిడవిట్ దాఖలు చేయటం ద్వారా జగన్ కు గట్టి మద్దతుగా నిలబడినట్లే అనుకోవాలి. అలాగే శాసనమండలి రద్దు అంశం కూడా కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉంది. ఇక పార్టీలో తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజుపై స్పీకర్ అనర్హత వేటు వేయటం కూడా పెండింగ్ లో ఉంది. ఎంపిపై అనర్హత వేటు వేయించటమన్నది జగన్ కు చాలా ప్రిస్టేజ్ విషయం అయిపోయింది.

ఏ రకంగా చూసినా జగన్ పర్యటన వెనుక మూడు నాలుగు హిడెన్ అజెండాలున్నాయనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. శాసనమండలి రద్దు విషయంలో జగన్ తాజా వైఖరి చూస్తుంటే కాస్త వెనక్కుతగ్గారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. కానీ ఎంపిలేమో లోక్ సభలో ఈ అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. జిఎస్టీ బకాయిలు విడుదల లాంటి అంశాలపై జగన్ ప్రత్యేకించి ఢిల్లీకి వచ్చి ప్రధానమంత్రినో లేకపోతే నిర్మల సీతారామన్నో కలవాల్సిన అవసరం లేదు. దానికి ఎంపిలే సరిపోతారు. పైగా జిఎస్టీ బకాయిలు రూ. 4300 కోట్ల విడుదలకు నిర్మల హామీ ఇచ్చేశారు. జగన్ పర్యటన మొదలైతే కానీ అసలైన అజెండా ఏమిటో బయటకు వస్తుందని అనుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.