ఏపీలో ఎన్నిక‌లు: వ‌ర్మ‌కు అవ‌కాశం

ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌ల ప‌ర్వానికి తెర‌లేవ‌నుంది. త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అదేంటి? నిన్న మొన్న‌నే క‌దా.. అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌లు జ‌రిగాయి… ఇప్పుడు ఎన్నిక‌లేంట‌ని ఆశ్చ‌ర్యంగా ఉందా.. ఆశ్చ‌ర్యం అవ‌స‌రం లేదు. ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే.. ఇవి శాస‌న మండ‌లి ఎన్నిక‌లు కావ‌డం గ‌మ‌నార్హం. వైసీపీ శాస‌న మండ‌లి స‌భ్యులుగా ఉన్న మ‌హ‌మ్మ‌ద్ ఇక్బాల్‌, సి. రామ‌చంద్ర‌య్య‌లు.. ఎన్నిక‌లకు ముందు పార్టీ మారిన విష‌యం తెలిసిందే. వారు నేరుగా వెళ్లి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆగ్ర‌హించిన వైసీపీ వారిపై అన‌ర్హ‌త వేటు చేసింది.

దీంతో ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యారు. మండ‌లిలో వైసీపీ నాయ‌కుడు, మోషేన్ రాజు చైర్మ‌న్‌గా ఉండ‌డంతో అన‌ర్హ‌త వేటు వేయ‌డం..ఈజీ అయిపోయింద‌నే వాద‌న ఉంది. ఇక‌, ఇప్పుడు వీటికి మూడు మాసాల్లో తిరిగి ఉప ఎన్నిక‌లు నిర్వ‌హించాలి. ఇప్ప‌టికే రెండు మాసాల‌కు పైగా అయిపోయింది. దీంతో రేపోమాపో ఎన్నికల ‌సంఘం నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. అయితే.. ఈ రెండు స్థానాలు కూడా.. టీడీపీ కూట‌మికే ద‌క్క‌నున్నాయ‌ని అన‌డంలో సందేహం లేదు. ఎందుకంటే.. ఈ రెండు మండలి స్థానాలు కూడా.. ‘ఎమ్మెల్యే కోటా’ స్థానాలు. అంటే.. స‌భ‌లో ఉన్న ఎమ్మెల్యేలు ఓటేయ‌డం ద్వారా వీరిని ఎన్నుకోనున్నారు.

గ‌తంలో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యే బ‌లం ఉండ‌డంతో ఎన్నిక ఈజీ అయిన‌ట్టే.. ఇప్పుడు కూట‌మికి 164 మంది స‌భ్యులు ఉండ‌డంతో మ‌రింత ఈజీగా కూట‌మి ఎంచుకున్న అభ్య‌ర్థులు ఇద్ద‌రూ..రెడ్ కార్పెట్‌పై మండ‌లిలో అడుగు పెట్ట‌నున్నారు. ఇదిలావుంటే.. ఎవ‌రిని ఈ రెండు ప‌ద‌వుల‌కు ఎంపిక చేస్తార‌నేది ఆస‌క్తిగా మారింది. ఒక‌టి.. పిఠాపురం టికెట్‌ను వ‌దులుకుని మ‌రీ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను గెలిపించ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన వ‌ర్మ‌కు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

అదేవిధంగా జ‌న‌సేన‌లో నాగ‌బాబు కూడా ఈ పద‌వి కోసం పోటీ చేసే అవ‌కాశం ఉంది. ఇక‌, టీడీపీ నుంచి కూడా సీట్లు వ‌దులుకుని పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన‌ దేవినేని ఉమా(మైల‌వ‌రం), ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్‌(తెనాలి), వైసీపీ నుంచి వ‌చ్చి టీడీపీ కోసం ప‌నిచేసిన వారు.. కూడా ఎదురు చూస్తున్నారు. దీంతో ఎవ‌రికి ఈ రెండు టికెట్లు ఇస్తార‌నేది చూడాలి. ఎవ‌రికి కేటాయించినా.. వారు ఖ‌చ్చితంగా మండ‌లిలో అడుగు పెట్టునున్నారు. మ‌రి ఎవ‌రికి ఈ అదృష్టం ద‌క్కుతుందో చూడాలి.