ఒకే ఫ్రేములో చిరు రజని బాలయ్య

కొన్ని సందర్భాలు అరుదైన కలయికలు సృష్టిస్తాయి. ఇవాళ జరుగుతున్న నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకార మహోత్సవం అరుదైన జ్ఞాపకాలకు వేదికగా మారుతోంది. ఎన్నో సంవత్సరాల తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, రజనీకాంత్ లను ఒకే వేదిక మీద చూడటం అభిమానులకు అంతులేని ఆనందాన్ని కలిగిస్తోంది.

స్టేజి మీద వచ్చిన అతిథులకు సాదరంగా స్వాగతం పలికి వాళ్ళను కేటాయించిన కుర్చీలవైపు పంపించే బాధ్యతను తీసుకున్న బాలయ్య ముందు చిరంజీవితో కరచాలనం చేయడం, ఆ తర్వాత రజనీకాంత్ దంపతులకు వెల్కమ్ చెప్పడం అందరినీ ఆకట్టుకుంది.

చిరు, బాలయ్య, రజిని, లతలకు ఒకే చోట ఆసనాలు కేటాయించారు. బాలకృష్ణ దగ్గరుండి ఇబ్బందేమీ కలగలేదు కదాని రజనిని అడిగి తెలుసుకోవడం, అలాంటిదేమి లేదని తలైవర్ స్పష్టం చేయడం కనిపించింది. ఆ తర్వాత రజని చిరు ఇద్దరూ ముచ్చట్లలో పడిపోయారు.

వచ్చిన జన సందోహం గురించి, ఏర్పాట్లు వగైరాల గురించి మాట్లాడుకోవడం లైవ్ లో ఫ్యాన్స్ చూస్తూనే ఉన్నారు. ఇలా ఈ ముగ్గురు ఒకేసారి ఎప్పుడు కలుసుకున్నారంటే సమాధానం చెప్పడం డౌటే. కనీసం రెండు మూడు దశాబ్దాలు వెనక్కు వెళ్లినా గుర్తు చేసుకోవడం కష్టం. అందుకే బెస్ట్ మెమరీగా ఉండిపోతుంది.

విశిష్ట అతిథులుగా వచ్చిన చిరు, రజనిలతో పాటు నారా రోహిత్, నిఖిల్, దర్శకుడు క్రిష్ తదితరులు వచ్చిన గెస్టుల్లో ఉన్నారు. ఇంకా వస్తూనే ఉన్నారు. కేవలం రాజకీయానికి మాత్రమే పరిమితం అవ్వాల్సిన ఇలాంటి వేడుక ఈసారి సినీ రంగంపరంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది.

పవన్ కళ్యాణ్ ఒక కారణమైతే చంద్రబాబునాయుడు గతంలో మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీకి అందించిన సహకారం మరొకటి. సినిమాలు తప్ప వేరే ప్రపంచం లేకుండా ఉండే సగటు అభిమానులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వేడుక మొత్తాన్ని చూడటం అరుదనే చెప్పాలి.