కేంద్ర క్యాబినెట్ పై అసంతృప్తి సెగలు

ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర క్యాబినెట్ కూర్పుపై అసంతృప్తి సెగలు మొదలయ్యాయి.
మంత్రి పదవులు కేటాయింపుపై శివసేన(షిండే వర్గం) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ కంటే తక్కువ ఎంపీ సీట్లు గెలుచుకొన్న ఇతర ఎన్డీయే పక్ష పార్టీలకు క్యాబినెట్‌ హోదా కలిగిన మంత్రి పదవులు కేటాయించి.. మహారాష్ట్రలో ఏడు లోక్‌సభ స్థానాలు గెలుచుకొన్న తమకు మాత్రం సహాయ మంత్రి పదవి ఇవ్వడంపై పెదవి విరిచింది.

పదవుల కేటాయింపులో బీజేపీ పక్షపాతం చూపిందని శివసేన(షిండే) ఎంపీ శ్రీరంగ్‌ బర్నే అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం క్యాబినెట్‌ హోదా మంత్రి పదవి దక్కుతుందని ఆశించామని అన్నారు. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు గెలుచుకొన్న అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ కూడా మంత్రి పదవి కేటాయింపుపై వేచి చూసే ధోరణిలో ఉన్నట్టు కనిపిస్తున్నది.

ఐదు సీట్లు గెలిచిన చిరాగ్‌ పాశ్వాన్‌ పార్టీకి, రెండు సీట్లు గెలుచుకొన్న జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి, ఒక్క సీటు మాత్రమే గెలిచిన జితిన్‌ రాం మాంఝీకి క్యాబినెట్‌ పదవులు ఇచ్చారని ఎన్డీయే కూటమిలో జేడీయూ, టీడీపీ తర్వాత తమ పార్టీనే పెద్ద భాగస్వామి అని శ్రీరంగ్ బర్నే అన్నారు. మహారాష్ట్రలో 15 సీట్లలో పోటీచేసిన తాము ఏడు సీట్లలో విజయం సాధించామని, 28 స్థానాల్లో నిలిచిన బీజేపీ కేవలం తొమ్మిదింటిలో మాత్రమే గెలిచిందని గుర్తు చేశారు.

బీజేపీ పాత మిత్రులుగా ఉన్న తన్న తమ పార్టీకి కేంద్ర మంత్రివర్గంలో ఒక క్యాబినెట్‌ హోదా మంత్రి, ఒక సహాయ మంత్రి పదవిని ఆశిస్తున్నామని, మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను కలిసి ఎదుర్కోనున్న నేపథ్యంలో శివసేనకు తగిన గౌరవం దక్కుతుందని భావిస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు.