వైసీపీ ప్ర‌చారం.. ఖండించిన అధికారులు

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు సంబంధించి సోమ‌వారం ఉద‌యం నుంచి సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చాయి. ఆయ‌న ఈ నెల 12న ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబు కోసం.. పెద్ద ఎత్తున 11 కార్ల‌ను కొనుగోలు చేసి కాన్వాయ్ కోసం వినియోగిస్తు న్నారంటూ.. వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై అదే సోష‌ల్ మీడియాలో కొన్ని విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. 11 కార్ల కోసం.. 12 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేయ‌డం అవ‌స‌ర‌మా? అంటూ.. కొంద‌రు ప్ర‌శ్నించారు.

దీంతో చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కు .. అధికారులు రంగంలోకి దిగారు. ఈ వార్త‌ల్లో నిజం ఎంతో స‌రిచూసుకున్నారు. ఆ వెంట‌నే ఆయా వార్త‌ల‌ను ఖండించారు. టీడిపి అధినేత చంద్రబాబు కోసం తాడేపల్లిలోని ఇంటెలిజెన్స్‌ కార్యాలయం వద్ద మొత్తం 11 వాహనాలను అధికారులు సిద్ధం చేసినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆ పార్టీ సైతం తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

“ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం కొత్త కాన్వాయ్ కొనుగోలు అంటూ సర్క్యులేట్ అవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి చక్కర్లు కొడుతున్న వార్తలను అధికారులు ఖండించారు. కాన్వాయ్ కోసం వినియోగిస్తున్న వాహనాలన్నీ పాత వాహనాలే. ఎప్పటి నుండో వినియోగిస్తున్నవే అని స్పష్టం చేశారు.” అని టీడీపీ నేత‌లు పోస్టులో పేర్కొన్నారు. అయితే.. ఈ సోష‌ల్ మీడియా పోస్టుల వెనుక వైసీపీ నాయ‌కుల హ‌స్తం ఉంద‌ని గుర్తించారు.

చంద్ర‌బాబు కాన్వాయ్ విష‌యంలో విదేశాల నుంచి కొంద‌రు వైసీపీ నాయ‌కులు పాత ఫొటోల‌ను పోస్టు చేసి అల‌జ‌డి సృష్టించే ప్ర‌య‌త్నం చేశార‌ని.. వీటిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సైబ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌నున్న‌ట్టు అధికార వ‌ర్గాలు తెలిపాయి. ఇక‌, టీడీపీ నాయ‌కులు కూడా.. ప్ర‌స్తుతం చంద్ర‌బాబుకు ఎలాంటి కాన్వాయ్ కొనుగోలు చేయ‌డం లేద‌ని.. ఉన్న‌వాటినే స‌ర్దుకుంటార‌ని తెలిపారు.