జగన్‌కు వ్యతిరేకంగా ప్లేటు తిప్పేసిన స్వామీజీ

2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం కేంద్రంగా ఆశ్రమం నడిపే స్వరూపానంద స్వామితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత సన్నిహితంగా మెలిగారో.. ఆయనకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో తెలిసిందే. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కొన్నిసార్లు స్వరూపానంద దగ్గరికెళ్లి వెళ్లి పాదాల దగ్గర కూర్చుని సేవ చేసుున్నారు. మరో వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి సైతం స్వరూపానందకు పాదాభివందనం చేశారు. కొన్నేళ్ల పాటు స్వరూపానందకు జగన్ ప్రభుత్వం ఎక్కడ లేని ప్రాధాన్యం ఇచ్చింది. స్వరూపానంద కూడా జగన్, ఆయన ప్రభుత్వాన్ని కొనియాడేవారు.

కానీ ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలై.. చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిందో లేదో స్వరూపానంద స్వరం మార్చేశారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించంతో పాటు చంద్రబాబు మీద ప్రశంసలు కురిపించేశారు.

“నేను ఎవరికీ భయపడి కాదు. ఎప్పుడూ స్వరూపానంద ఒకలాగే ఉంటారు. చంద్రబాబు అంటే నాకు ఎంతో గౌరవం. ఆయన పెద్దవాడు. రాష్ట్రానికి పెద్ద దిక్కుగా పరిపాలన కొనసాగాలి. ఆయన కుటుంబం బాగుండాలి. పరిపూర్ణమైన ఆయుష్షుతో ఉంటూ రాష్ట్రాన్ని బాగా పరిపాలించాలి. నేను చంద్రబాబును కొత్తగా పొగుడుతున్నాను అనుకోవద్దు. గతంలో మురళీ మోహన్ ఎంపీగా ఉన్నపుడు చంద్రబాబు గెలవాలని రాజమండ్రిలో పెద్ద సభలు పెట్టి, సాధువులన్నీ పిలిచి యాగం చేశాను. అదే విధంగా జగన్ ప్రభుత్వం తప్పులు చేస్తే చెప్పాను. శ్రీశైలం కుంభాభిషేకం ఆపాలని చెబితే.. జగన్ కోర్టులను మేనేజ్ చేసి ఆ అభిషేకం చేశాడు. ఇంకా సింహాచలంలో, తిరుమలలో తప్పులు జరిగితే నేను బయటికి వచ్చి గళం విప్పాను. నేను ఎవరికీ అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు. ఏ ప్రభుత్వం వచ్చినా.. ఎవరు మా దగ్గరికి వచ్చినా ఉన్నదున్నట్లు మాట్లాడతాం” అని స్వరూపానంద ప్రెస్ మీట్లో చెప్పారు.