‘ప‌వ‌న్’ అంటే… గాలి కాదు.. సునామీ: మోడీ

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై బీజేపీ అగ్ర‌నేత‌, ఎన్డీయే కూట‌మి ప్ర‌ధాన మంత్రి అభ్య‌ర్థి న‌రేంద్ర మోడీ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ప‌వ‌న్ అంటే.. గాలికాద‌ని.. అదొక సునామీ అని కొనియాడారు. తాజాగా.. ఢిల్లీలోని పాత పార్ల‌మెంటు భ‌వ‌నంలో ఎన్డీయే కూట‌మి పార్టీల స‌మావేశం జ‌రిగింది. దీనిలో త‌దుప‌రి ప్ర‌ధానిగా మ‌రోసారి న‌రేంద్ర మోడీనే ఎన్నుకున్నారు. ఈ స‌మ‌యంలో ప‌వ‌న్ మాట్లాడుతూ.. మోడీ ఈ దేశానికి ప్ర‌ధానిగా ఉన్నంత కాలం.. ఏ దేశం ముందు.. భార‌త్ త‌ల వంచ‌ద‌ని పేర్కొన్నారు.

అంతేకాదు.. ఈ దేశానికి మోడీ వంటి నాయ‌కుడు ప్ర‌ధాని కావ‌డం.. అత్యంత గ‌ర్వ కార‌ణ‌మ‌ని పేర్కొన్నా రు. అనంత‌రం మాట్లాడిన మోడీ.. ప‌వ‌న్ ను ఆకాశానికి ఎత్తేశారు. ప‌వన్ కల్యాణ్ అంటే పవనం(గాలి) కాదని… సునామీ అని ప్రశంసించారు. ఏపీ ప్రజలు తమకు అతిపెద్ద బహుమతి ఇచ్చారని తెలిపారు. ఏపీలో ఎన్డీయే కూటమి చ‌రిత్రాత్మ‌క విజ‌యం న‌మోదు చేసుకంద‌ని. ఈ విష‌యంలో చంద్ర‌బాబుతో పాటు.. ప‌వ‌న్ పాత్ర ఎంతో ఉంద‌ని తెలిపారు.

పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలిచి.. 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన ఘ‌న‌త ప‌వ‌న్ ఒక్క‌రిదేన‌ని తెలిపారు. పవన్ కల్యాణ్ అంటే ఓ సునామీ అని అభివర్ణించారు. అలాంటి పవన్ ఇప్పుడు మన సమక్షం లోనే ఉన్నారని మోడీ వ్యాఖ్యానించారు. కూట‌మి పార్టీల విజ‌న్ త‌న‌కు తెలుసున‌ని పేర్కొన్నారు. సుప‌రిపాల‌న అందించేందుకు ఎన్డీయే కూట‌మి నిరంత‌రం కృషి చేస్తుంద‌ని మోడీ చెప్పారు. ఎన్డీయే కూట‌మి పార్టీలు ఈ దేశాన్ని ముందుకు న‌డిపిస్తాయ‌ని మోడీ పేర్కొన్నారు.

కాగా.. ఏపీలో ప‌వ‌న్ పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో 21 విజ‌యం సాధించారు. అలాగే 2 పార్ల‌మెంటు స్థానాల్లో పోటీ చేసి(మ‌చిలీప‌ట్నం, కాకినాడ‌) రెండు చోట్లా గెలుపు గుర్రం ఎక్క‌డంతో ఎన్డీయే కూట‌మి పార్టీలు కూడా.. ఆస‌క్తిగా ఆ విష‌యాన్ని పంచుకున్నాయి. ప‌లువురు ఉత్త‌రాది యువ నాయ‌కులు, ఎంపీలు… ప‌వ‌న్‌తో క‌లిసి సెల్ఫీలు దిగేందుకు పోటీ ప‌డ్డారు.