అమాత్యులయ్యే అదృష్టవంతులు ఎవరో ?

ఉత్తరాదిన ఎదురుగాలి వీచినా దక్షిణాదిన ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా ఎనిమిది ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. ఆదిలాబాద్ లో గొడెం నగేష్, కరీంనగర్ లో బండి సంజయ్, నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్, మల్కాజ్ గిరిలో ఈటెల రాజేందర్, మెదక్ లో రఘునందన్ రావు, సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి, చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ లో డీకె అరుణలు విజయం సాధించారు.

గత ఎన్నికల్లో నలుగురు విజయం సాధించినా కేంద్ర మంత్రి వర్గంలో ఒక్క కిషన్ రెడ్డికి మాత్రమే అవకాశం దక్కింది. బండి సంజయ్ ని రాష్ట్ర అధ్యక్ష్య పదవి నుండి తప్పించినప్పుడు కేంద్రంలో మంత్రి పదవి ఇస్తారన్న వార్తలు వినిపించాయి. కానీ జాతీయపార్టీలో పదవి ఇచ్చి సరిపుచ్చారు. అమిత్ షాతో సన్నిహిత సంబంధాలు ఉన్న అరవింద్ కు కూడా ఒక దశలో మంత్రి పదవి గ్యారంటీ అన్న వార్తలు వినిపించాయి.

ఈ నేపథ్యంలో ఈ సారి తెలంగాణ నుండి మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో మాజీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు ఈటెల రాజేందర్, డీకె అరుణ, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లు ఉన్నారు. సికింద్రాబాద్ నుండి రెండోసారి విజయం సాధించిన కిషన్ రెడ్డికి ఈసారి కీలకశాఖ ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది. బండి సంజయ్‌, డీకే అరుణ, ఈటలల్లో ఒకరికి లేదా ఇద్దరికి సహాయ మంత్రులుగా అవకాశం లభించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అయితే ఈసారి కేంద్రంలో బీజేపీకి సొంతంగా పూర్తి మెజారిటీ లేదు. ఏపీలో 16 స్థానాలు గెలిచిన టీడీపీ, 2 స్థానాలు గెలిచిన జనసేనలది ఎన్డీఎ ప్రభుత్వంలో కీలకపాత్ర అయింది. ఈ నేపథ్యంలో వారు అక్కడ ఎన్ని మంత్రి పదవులు డిమాండ్ చేస్తారు ? అన్న అనుమానాలు ఉంది. ఈ పరిస్థితులలో తెలంగాణకు వచ్చే మంత్రి పదవులు ఎన్ని అన్న అనుమానాలు నెలకొన్నాయి. బీజేపీ అధిష్టానం ఈ సారి ఏం నిర్ణయం తీసుకుంటుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.