విప్ల‌వ‌మా.. తిరుగుబాటా.. ఏపీలో ఏం జ‌రిగింది?

YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy

సునామీని మించిన ఓట్ల వ‌ర‌ద‌.. గంగా ప్ర‌వాహాన్ని మించిన ఫ‌లితాల వెల్లువ‌.. చూస్తే.. ఏపీలో ఏం జ‌రిగింది? విప్ల‌వ‌మా? లేక ప్ర‌జ‌ల తిరుగుబాటా? అనేది ఆస‌క్తిగా మారింది.

1970ల‌లో కేంద్రంలో అధికారంలో ఉన్న ఇందిరాగాంధీ దేశ‌వ్యాప్తంగా ఎమ‌ర్జెన్సీ విధించారు. పార్టీల‌తో సంబంధం లేకుండా.. ప్ర‌శ్నించిన వారిని జైళ్ల‌కు త‌రిమికొట్టారు. దీంతో జైళ్ల‌న్నీ కిక్కిరిసిపోయాయి.

దీనిని క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌రకు ప్ర‌జ‌లు తిర‌స్క‌రించారు. ఆమె తీసుకున్న నిర్ణ‌యాల‌ను తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేకించారు. ఫ‌లితంగా..త‌ర్వాత వ‌చ్చిన ఎన్నిక‌ల్లో ఇందిరా గాంధీని ఆమె పార్టీని కూడా.. చిత్తుచిత్తుగా ఓడించారు.

దీనిని అప్ప‌ట్లో ప్ర‌ముఖ ప‌త్రిక‌లు.. ప్ర‌జ‌ల్లో వ‌చ్చిన తిరుగుబాటుగా పేర్కొన్నాయి. ఇవే విష‌యాన్ని బ్యాన‌ర్ హెడ్డింగుల‌తో ఫ‌స్ట్ పేజీల్లో ముద్రించాయి. క‌ట్ చేస్తే.. 1990ల‌లో త‌మిళ‌నాడులో జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌య‌ల‌లిత పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కేవ‌లం ఇద్ద‌రు మాత్ర‌మే గెలిచారు.

దీనికి కార‌ణం.. అప్ప‌ట్లో క‌రుణానిధి పార్టీ డీఎంకే భారీ ఎత్తున ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించింది. ఇంటింటికీ 25 కిలోల బియ్యంతోపాటు.. పిల్ల‌ల‌కు ఉచితంగా కార్పొరేట్ విద్య‌, ప్ర‌తి ఇంటికీనెల‌కు 500 అంటూ పెద్ద ఎత్తున హామీలు గుప్పించారు. దీంతో జ‌య‌ల‌లిత ఘోర ప‌రాజ‌యం చ‌విచూశారు.

ఈ ఫ‌లితం త‌ర్వాత‌.. ఆ నాటి ప‌త్రిక‌లు.. ప్ర‌జ‌ల్లో వ‌చ్చిన విప్ల‌వం అంటూ క‌థ‌నాలు రాశాయి. మ‌రి ఇప్పుడు ఏపీలో ఏం జ‌రిగింది? తిరుగుబాటు వ‌చ్చిందా? లేక విప్ల‌వం వ‌చ్చిందా? లేక‌.. ఈ రెండూ క‌లిసి వ‌చ్చాయా? అనేది ఆస‌క్తిక‌ర విష‌యం. ఎందుకంటే.. ప్ర‌తిప‌క్షం ఉండ‌కూడ‌ద‌న్న దుగ్ధ‌తో చంద్ర‌బాబును అరెస్టు చేయించి జైల్లో పెట్టించారు. 74 ఏళ్ల వ‌య‌సులో చంద్ర‌బాబును అరెస్టుచేయ‌డాన్ని ఎవ‌రూ జీర్ణించుకోలేక పోయారు.

ఇక‌, ఇత‌ర నేత‌ల‌ను అణిచేయ‌డం.. ఎస్సీల‌పై దాడులు.. డ్రైవ‌ర్‌ను చంపి.. డోర్ డెలివ‌రీ చేసిన ఎమ్మెల్సీని వేటు వేయ‌క‌పోవ‌డం, డాక్ట‌ర్ సుధాక‌ర్‌ను దారుణంగా బంధించ‌డం.. ఇలా.. అనేకానేక ఘ‌ట‌న‌లతో ప్ర‌జ‌లు ఇక్క‌డ కూడా తిరుగుబాటు చేశార‌ని కొంద‌రు చెబుతున్నారు.

ఇదేస‌మ‌యంలో కూట‌మి పార్టీలు ఇచ్చిన సూప‌ర్ సిక్స్ వంటి ప‌థ‌కాలు.. ప్ర‌జ‌ల‌ను ముఖ్యంగా మ‌హిళ‌ల‌ను మంత్ర ముగ్ధుల‌ను చేశాయ‌నే వాద‌న ఉంది. దీంతో విప్ల‌వం వ‌చ్చింద‌ని మ‌రికొంద‌రు చెబుతున్నారు. ఈ రెండు ప‌రిణామాల కార‌ణంగానే.. ఇప్పుడు ఈవీఎంలు బ‌ద్ద‌లై.. టీడీపీ కూట‌మి.. అంబ‌ర‌మంత విజ‌యాన్ని కైవ‌సం చేసుకుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.