జూన్ 9 – సరికొత్త చరిత్రకు శ్రీకారం

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా నాలుగోసారి ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇంకా కౌంటింగ్ కొనసాగుతున్నప్పటికీ ఉదయం పదకొండు గంటలకే ఏం జరగబోతోందో అందరికీ అర్థమైపోయింది. సాయంత్రం వచ్చే తుది ఫలితాలు కేవలం లాంఛనం మాత్రమే. ఆధిక్యం చెక్ చేసుకోవడం మినహాయించి దాదాపు అన్ని స్థానాల్లో విజేతలెవరో మీడియాతో పాటు సామాన్య జనాలకు స్పష్టత వచ్చేసింది. చాలా చోట్ల అప్పుడే గెలుపు సంబరాలు మొదలయ్యి మిన్నంటుతున్నాయి.

తాజా సమాచారం మేరకు జూన్ 9 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ బాధ్యతను దర్శకుడు బోయపాటి శీనుకి అప్పగించినట్టు తెలిసింది. కాసేపటి క్రితం వీళిద్దరి మధ్య చిన్న సమావేశం జరగడం ఈ వార్తకు బలాన్ని చేకూర్చింది. రాజధాని లేకుండా అయిదేళ్ల పాటు అల్లాడిపోయిన రాష్ట్రానికి తగిన భరోసా ఇచ్చేందుకు టిడిపి నాయకుడు సిద్ధమవుతున్నారు. సూపర్ సిక్స్ గ్యారెంటీలతో పాటు చేయబోయే, చేయాల్సిన కార్యక్రమాల గురించి చంద్రబాబు జూన్ తొమ్మిదిన హామీ ఇవ్వబోతున్నారు.

అంగరంగ వైభవంగా జరిగే ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు రాబోతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బిజెపి ప్రతినిధులతో పాటు సినీ, రాజకీయ, వ్యాపార వర్గాల నుంచి భారీ ఎత్తున సెలబ్రిటీలు వస్తారని తెలిసింది. తెలుగుదేశంకి పూర్తి జవసత్వాలను అందిస్తూ జనం ఇచ్చిన తీర్పుని గౌరవించేలా పాలన అందించేందుకు అధినాయకత్వం అడుగులు వేయాల్సి ఉంటుంది. పట్టం కడితే చాలనుకుంటే కూటమికి మర్చిపోలేని స్థాయిలో పట్టాభిషేకం చేశారు. డబ్బులు పంచితే చాలు అదే అభివృద్ధని భ్రమపడే ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా ఓటర్లు గర్జించారు.