టీడీపీ చ‌రిత్ర‌లో క‌నీవినీ ఎరుగ‌ని విజ‌యం!

2024 ఎన్నిక‌ల్లో గెలుస్తామా? గెల‌వ‌లేమా? అన్న స్థాయి నుంచి క‌నీవినీ ఎరుగ‌ని విజ‌యం దిశ‌గా టీడీపీ దూసుకుపోతోంది. గ‌త 2014, 2019 ఎన్నిక‌ల‌తోపోల్చుకుంటే.. 2024 ఎన్నిక‌లు టీడీపీకి ఒక కొత్త చ‌రిత్ర‌ను అందించాయి. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ కేవ‌లం 102 స్థానాల‌కే ప‌రిమితం అయింది. ఇవి ఒంట‌రిగా తెచ్చుకున్న సీట్లు. ఇక‌, 2019 ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి ఒంటరిగానే పోటీలో నిలిచింది. ఫ‌లితంగా 23 స్థానాల‌కే ప‌రిమితం అయింది. వీరిలోనూ న‌లుగురు జంప్ అయిపోయారు.

దీంతో వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. ఆ పార్టీ వ‌చ్చిన నాటి నుంచి టీడీపీ అనేక ఇబ్బందులు ప‌డింద‌నే విష‌యంలో సందేహం లేదు. ఒకానొక సంద‌ర్భంలో ప్రధాన ప్ర‌తిప‌క్షం కూడా.. ద‌క్కే ప‌రిస్థితి లేకుండా పోయింద‌నే వాద‌న వినిపించింది. ఇక‌, కేసుల న‌మోదు.. నాయ‌కుల‌ను అరెస్టు చేయ‌డం జైళ్ల‌లో పెట్ట‌డం తో న్యాయ పోరాటాలు నిత్యంకృత్యం అయ్యాయి. మ‌రీముఖ్యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబును కూడా జైల్లో పెట్ట‌డం వంటివి పార్టీని ఇబ్బందుల్లో కి నెట్టాయి.

దీంతో అస‌లు పార్టీ ఉంటుందా? ఉండ‌దా? అనే చ‌ర్చ కూడా తెర‌మీదికి వ‌చ్చింది. కానీ, ప్ర‌స్తుతం వ‌స్తున్న ట్రెండ్‌లో మాత్రం టీడీపీ ఒంట‌రిగానే మేజిక్ ఫిగ‌ర్ దాటిపోయింది. ప్ర‌స్తుతం పొత్తు పెట్టుకున్న టీడీపీ 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో 144 స్థానాల్లో మాత్ర‌మే పోటీ చేసింది. అయితే.. 129 స్థానాల్లో టీడీపీ ఒంట‌రిగానే విజ‌యం ద‌క్కించుకునేలా ముందుకు సాగుతోంది.

ఇప్ప‌టికే 100 స్థానాల్లో దాదాపు టీడీపీ ఒంట‌రి విజ‌యం ఖాయ‌మైంది. దీంతో మొత్తం 129 స్థానాల్లోటీడీపీ క‌నుక విజ‌యం ద‌క్కించుకుంటే.. ఇది క‌నీ వినీ ఎరుగ‌ని విజ‌యంగానే భావించాలి.అంతేకాదు.. చంద్ర‌బాబు పార్టీ అధినేత అయిన త‌ర్వాత‌.. ద‌క్కిన అద్భుత విజ‌యంగానే దీనిని భావించాలి.