ఏపీలో మార‌ని తీరు.. ఇప్పుడు ఎవ‌రిది పాపం?

Andhra Pradesh

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వ తీరు మార‌లేదు. గ‌త రెండు మాసాలుగా సామాజిక‌ పింఛ‌ను దారుల‌ను  ఇబ్బంది పెట్ట‌కుండా వారికి ఇచ్చే సొమ్మును గౌర‌వంగా ఇచ్చే అవ‌కాశం ఉన్నా.. కూడా బ్యాంకుల చుట్టూ తిప్పారు. గ్రామ , వార్డు స‌చివాల‌య వ‌ద్ద నిరీక్షిం చేలా చేశారు. దీంతో మే, ఏప్రిల్ మాసాల్లో అనేక మంది వృద్ధులు, దివ్యాంగులు, ఒంట‌రి మ‌హిళ‌లు నానా తిప్ప‌లు ప‌డ్డారు. చివ‌ర‌కు మే నెల‌లో అయితే.. ఇది మ‌రింత దారుణంగా సాగింది. బ్యాంకుల్లో జ‌మ చేయ‌డంతో వారు ఈ సొమ్మును అందుకోలేక పోయార‌ని ప్ర‌భుత్వానికి నివేదిక‌లు కూడా అందాయి. ఎప్ప‌టి నుంచో వినియోగించ‌ని ఖాతాల కార‌ణంగా బ్యాంకులు ఫైన్లు వేశాయి.

దీనికి తోడు ల‌క్ష‌ల మందికి పాన్ కార్డులు లేక‌పోవ‌డంతో బ్యాంకులు సొమ్ము ఇచ్చేందుకు నిరాక‌రించాయి. మొత్తం 60ల‌క్ష‌ల మంది ఉన్న పింఛ‌ను దారుల్లో కేవ‌లం 45 ల‌క్ష‌ల మంది మాత్ర‌మే తీసుకున్న‌ట్టు రికార్డులు చెబుతున్నాయి. అయితే.. అప్ప‌ట్లో ఈ పాపం అంతా కూడా.. చంద్ర‌బాబుదేన‌ని.. ఆయ‌న వ‌ర్గంగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్ ప‌రివారం దేన‌ని సర్కారు పెద్ద‌లు ప్ర‌క‌టించుకుని ప్ర‌చారం కూడా చేసుకున్నారు. ఎన్నిక‌ల్లో దీనినే ప్ర‌దానంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లారు. వీరు ఫిర్యాదు చేయ‌డంతోనే కేంద్ర ఎన్నిక‌ల సంఘం వ‌లంటీర్ల‌ను ఆపేసింద‌ని.. అందుకే.. ఇలాంటి దుస్థితి వ‌చ్చింద‌ని కూడా చెప్పుకొచ్చారు.

అయితే.. ఆ రెండు మాసాలు కూడా.. ఎన్నిక‌ల వేడి ఉండ‌డంతో ఇలా జ‌రిగింద‌నే విష‌యంలో కొంత మేర‌కు స‌మ‌ర్థ‌న వినిపిం చింది. కానీ, జూన్ 1వ తారీకు ప‌రిస్థితి ఏంటి?  ఇప్ప‌టికే ఎన్నిక‌లు ఏపీలో అయిపోయాయి. పెండింగు ఏమీ లేదు. నిర్ణ‌యం ఈవీఎంల‌లోకి చేరిపోయింది.సో.. ఇప్పుడు ఇదే ప్ర‌భుత్వం కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఒక అర్జీ పెట్టి వలంటీర్ వ్య‌వ‌స్థ‌ను తిరిగి గాడిలో పెట్టే అవ‌కాశం ఉంది. పోనీ.. కోర్టుకు వెళ్ల‌యినా.. పింఛ‌ను దారుల క‌ష్టాలు.. మృతి చెందిన వారి వివ‌రాలు ఇచ్చి.. త‌మ‌కు అనుకూలంగా తీర్పు తెచ్చుకునే అవ‌కాశం ఉంది.

కానీ, వైసీపీ స‌ర్కారు ఇప్పుడు ఆ ప‌ని చేయ‌లేదు. జూన్ 1న ఇచ్చే 60 ల‌క్ష‌ల మంది పింఛ‌న్ల‌ను కూడా.. బ్యాంకు ఖాతాల్లో వేస్తున్న‌ట్టు తాజాగా ఉత్త‌ర్వులు ఇచ్చింది. అంతేకాదు.. నిధుల‌ను కూడా జ‌మ చేసేసింది.   65.30 లక్షలకు పైగా ఉన్న‌ పెన్షనర్లకు రూ.1,939.35  కోట్లు విడుదల చేసినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు. ఈ మొత్తాన్ని జూన్ 1న నగదు బదిలీ  ల‌బ్ధిదారుల‌ ఖాతాల్లో పెన్షన్ సొమ్ము జత చేస్తామని వెల్లడించారు.  ఒక‌వైపు ఎండ‌లు ఇంకా త‌గ్గ‌లేదు. మ‌రోవైపు ఇలా చేస్తే.. మ‌ళ్లీ రాష్ట్రంలో మ‌ర‌ణాలు చోటుచేసుకునే అవ‌కాశం లేక‌పోలేదు. మ‌రి ఇప్పుడు ఎవ‌రిని త‌ప్పుబ‌ట్టాలి?  వైసీపీని కాదా?  వైసీపీ చేస్తున్న ఘోరం కాదా! అని టీడీపీ నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి దీనికి స‌ర్కారు పెద్ద‌లు ఏం చెబుతారో చూడాలి.