ఏపీలో పోస్ట‌ల్ బ్యాలెట్ లెక్కింపు బ్రేక్‌?!

ఏపీలో ఈ నెల 13న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ కేంద్రంగా ఇప్ప‌టికే రాజ‌కీయ దుమారం కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్నారెడ్డి సృష్టించిన విధ్వంసం.. తాడిప‌త్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సృష్టించిన అరాచ‌కం.. చంద్రగిరిలో టీడీపీ నాయ‌కుడు.. పులివ‌ర్తి నానిపై జ‌రిగిన హ‌త్యాయ‌త్నం వంటివి ఇప్ప‌టికీ ర‌గులుతూనే ఉన్నాయి. ఆయా నియోజకవ‌ర్గాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి కూడా నెల‌కొంది. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాలు నివురు గ‌ప్పిన నిప్పులా ఉన్నాయి.

ఆయా ఘ‌ట‌న‌ల‌పై టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ మ‌ద్య తీవ్ర‌స్థాయిలో రాజ‌కీయ దుమారం రేగుతున్న నేప‌థ్యంలో తాజాగా పోస్ట‌ల్ బ్యాలెట్ వ్య‌వ‌హారం కూడా తెర‌మీదికి వ‌చ్చింది. పోస్ట‌ల్ బ్యాలెట్ వినియోగించుకున్న ఉద్యోగులు.. ఓటు వేసే స‌మ‌యంలో సంత‌కం చేయ‌క‌పోయినా.. సీల్ స‌రిగా(అధికారి సంత‌కం.. + ముద్ర‌) లేక‌పోయినా.. ఫ‌ర్వాలేద‌ని.. ఆ ఓటును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని లెక్కించాల‌ని రెండు రోజుల కింద‌ట‌.. రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇదే ఇప్పుడురాజ‌కీయంగా తీవ్ర ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది.

మీనా తీసుకున్న నిర్ణ‌యాన్ని టీడీపీ స‌హా కూట‌మి పార్టీలు ఆహ్వానిస్తున్నాయి. కానీ, ఇదే స‌మ‌యంలో వైసీపీ మాత్రం తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది. దీనిలో ఎవ‌రి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు వారికి ఉన్నాయి. ఉద్యోగులు త‌మ‌కు అనుకూలంగా ఉన్నార‌ని భావిస్తున్న కూట‌మి.. వారి ఓట్లు ఎలా ఉన్నా.. చెల్లుబాటు అయ్యేలా చూడాల‌ని నాలుగు రోజుల కింద‌ట ఎన్నిక‌ల అధికారుల‌కు విన‌తి ఇచ్చింది. ఈ నేప‌థ్యంలోనే మీనా నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో పోలైన 4 ల‌క్ష‌ల పైచిలుకు ఓట్ల‌ను లెక్కించే అవ‌కాశం ఉంది. అంటే.. అవి అన‌ర్హ‌త ఉన్న‌ప్ప‌టికీ లెక్కించే ఛాన్స్ ఉంది.

అయితే.. ఈ ప‌రిణామం వైసీపీకి చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. ఉద్యోగులు గుండుగుత్త‌గా అంటే.. దాదాపు 4 ల‌క్ష‌ల్లో 3 ల‌క్ష‌ల మంది తీవ్ర వ్య‌తిరేకంగా ఉన్నార‌ని.. వైసీపీ భావిస్తోంది. దీంతో సాధ్య‌మైన‌న్ని లూప్ హోల్స్ లేదా నిబంధ‌న‌ల మేర‌కు.. ఆయా ఓట్ల‌ను చెల్ల‌కుండా పోతే.. త‌మ‌కు అనుకూలంగా మారుతుంద‌ని వైసీపీ నాయ‌కులు బావిస్తున్నారు. ఈ క్ర‌మంలో సీఈవో మీనా ఇచ్చిన ఆదేశాల‌పై నిప్పులు చెరుగుతోంది. ఇప్ప‌టికే ఒక‌సారి ఆయ‌న‌ను క‌లిసి స‌ద‌రు నిబంధ‌న‌లు పాటించాల‌ని.. దేశంలో ఎలాంటివి ఉన్నాయో.. వాటి ప్ర‌కార‌మే వ్య‌వ‌హ‌రించాల‌ని కోరారు.

కానీ, ఆయ‌న దీనికి స‌మ‌యం పెట్టారు. దీంతో హైకోర్టు, సుప్రీంకోర్టుకైనా వెళ్లి బ్యాలెట్ పోలింగ్ విష‌యంలో లెక్కింపును అడ్డుకునే వ్యూహంతో నిబ‌ధ‌న‌ల ప్ర‌కారం వ్య‌వ‌హ‌రించేలా ఆదేశాలు తెచ్చుకునే వ్యూహంతో వైసీపీ ఉండ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇది బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నిలిచిపోయేందుకు సైతం దారితీసే చాన్స్ ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.