సంచ‌ల‌నం: ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో కేసీఆర్ పేరు

ఆరు మాసాల కిందట దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణంలో తాజాగా మ‌రో సంచ‌ల‌నం వెలుగు చూసింది. ఈ స్కాం గురించిన అనే కీల‌క విష‌యాలు అన్నీ.. తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌కు తెలుసున‌ని ఈడీ పేర్కొంది. ఈ మేర‌కు ఢిల్లీ హైకోర్టులో అఫిడ‌విట్‌ను కూడా దాఖ‌లు చేసింది. ఈడీ త‌ర‌ఫు న్యాయ‌వాది ప‌దే ప‌దే కేసీఆర్ పేరును తాజాగా ప్ర‌స్తావించ‌డం గ‌మ‌నార్హం. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్ర‌భుత్వం లిక్క‌ర్ పాల‌సీని తీసుకువ‌చ్చింది. అయితే.. దీనిలో రూ.100 కోట్ల రూపాయ‌ల సౌత్ గ్రూప్‌కు మ‌ళ్లించ‌డంలో అక్క‌డ నుంచి ఆప్ నాయ‌కుల‌కు చేర‌వేయ‌డంలో ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె క‌విత ఉన్న‌ట్టు అధికారులు గుర్తించారు.

ఎమ్మెల్సీ క‌విత‌ ఈ కేసులో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని పేర్కొంటూ.. రెండు మాసాల కిందట అరెస్టు కూడా చేశారు. ప్ర‌స్తుతం క‌విత తీహార్ జైల్లో ఉన్నారు. అయ‌తే.. ఆమె త‌న‌కు బెయిల్ మంజూరు చేయాల‌ని కోరుతూ.. ఇప్ప‌టికే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా డిల్లీ హైకోర్టులో ఆమె పిటిష‌న్లు వేశారు. ఈ పిటిష‌న్ల విచార‌ణ మంగ‌ళ‌వారం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా త‌మ వాద‌న‌లు వినిపించిన ఈడీ న్యాయ‌వాది.. కేసీఆర్ పేరును తొలిసారి ప్ర‌స్తావించారు. “కేసీఆర్‌కు ఈ కేసు గురించి అంతా తెలుసు” అని న్యాయ‌వాది సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

“ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలోనే తన టీమ్ సభ్యులు బుచ్చిబాబు, అభిషేక్, అరుణ్ పిళ్లైలను కవిత తన తండ్రికి పరిచయం చేశారు. త‌ర్వాత వారి నుంచి కేసీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. త‌ర్వాత‌ సమీర్ మహేంద్రను కూడా క‌విత‌..తన తండ్రి కేసీఆర్‌కు పరిచయం చేశారు. ఆయ‌న‌కు అంతా తెలుసు. కానీ, ఏమీ తెలియ‌న‌ట్టే వ్య‌వ‌హ‌రించారు” అని ఈడీ త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టుకు వివ‌రించారు. అంతేకాదు.. ఎమ్మెల్సీ కవిత నాలుగు ఫోన్లు వినియోగించార‌ని. అయితే.. అన్ని ఫోన్ల‌ను ఆమె ధ్వంసం చేశార‌ని .. ఆధారాలు లేకుండా చేయాల‌నే ఇలా చేశార‌ని చెప్పుకొచ్చారు.

అయితే..అనూహ్యంగా కేసీఆర్‌ను ఈ కేసులోకి లాగ‌డం చూస్తే.. తెర‌వెనుక ఏదో జ‌రుగుతోంద‌న్న సందేహాలు వ‌స్తున్నాయి. ఇదిలావుంటే.. ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ సైతం ఈ కేసులో అరెస్ట‌యి.. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల నేప‌థ్యంలోనే ఆయ‌న బెయిల్ పొందారు. జూన్ 5న ఆయ‌న స్వ‌చ్ఛందంగా అధికారుల‌కు లొంగిపోయి జైలుకు వెళ్లాల్సి ఉంది.