భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చంద్రబాబు మాటలకు ఆదివారం ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఆ రెండు పనులు మీరు చేశారు కానీ భోగాపురం ఎయిర్ పోర్టును నిర్మించింది మాత్రం జగన్ మోహన్ రెడ్డేనని స్పష్టం చేశారు. అయినా
కొబ్బరికాయ కొట్టెందుకు.. గుమ్మడి కాయ కట్టెందుకు ముఖ్యమంత్రి అవసరం లేదని, దారిన పోయేవాడు ఎవడైనా కొబ్బరి కాయ కట్టమంటే కడతాడని, గుమ్మడి కాయ కట్టమంటే కడతాడని ఎద్దేవా చేశారు. ఎయిర్ పోర్టు కట్టింది జగనే అన్న వాస్తవం ప్రజలు తెలుసుకున్నారని చంద్రబాబు గుర్తించడం అవసరం అన్నారు. అమర్నాథ్ కామెంట్స్ మీద టీడీపీ శ్రేణులు విరుచుకొని పడుతున్నారు. పలువురు నెటిజన్లు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.
అమర్నాథ్ విమర్శలతో ఇరు పార్టీల మధ్య చిచ్చు రాజేసినట్లు కనిపిస్తుంది. భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రధాన మంత్రి సమక్షంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద పరోక్షంగా విమర్శలు గుప్పించడాన్ని జీర్ణించుకోలేక పోతున్న వైసీపీ నాయకులు ఒక్కొక్కరు ఇప్పుడు బయటకు వచ్చి విమర్శలు చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
31.04 శాతం మాత్రమే పనులు పూర్తి…
ఇదిలావుండగా భోగాపురం విమానాశ్రయం పనులు 2024 జూన్ నాటికి కేవలం 31.04 శాతం పనులు మాత్రమే పూర్తయ్యిందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రాజ్యసభలో విజయసాయి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
అప్పుడు విజయ సాయి రెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అంటే వైసీపీ పాలన పూర్తయ్యే వరకు కేవలం 31 శాతం మాత్రమే ఎయిర్ పోర్టు పనులు జరిగినట్లు అవుతుందని టీడీపీ శ్రేణులు అప్పటి లేఖ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాంతో వైసీపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారిందని ట్రోలింగ్ చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates

