వీరికి న్యాయం చేయాలి బాబూ..!

టీడీపీ స‌ర్కారు క‌నుక అధికారంలోకి వ‌స్తే.. అంటే.. కూట‌మి గెలిచి.. పార్టీ అధికారంలోకి వ‌స్తే.. మంత్రి ప‌ద‌వుల విష‌యంలో యాగీ ఉండ‌డం ఖాయం. ఎందుకంటే.. 21 స్థానాల్లో పోటీ చేసిన జ‌న‌సేన‌, 10 స్థానాలు తీసుకున్న బీజేపీ కూడా.. జోరుగానే ప్ర‌య‌త్నించింది. హోరుగానే ప్ర‌చారం చేసుకుంది. ఎక్క‌డిక్క‌డ గెలుపు గుర్రాల‌నే పెట్టుకున్నారు. వీరిలో ఎవ‌రినీ త‌క్కువగా అంచ‌నా వేయ‌లేం. అదేస‌మ‌యంలో గెలుస్తారో.. లేదో అన్న అనుమానం ఉన్న‌ప్ప‌టికీ.. బ‌ల‌మైన పోటీనే ఇచ్చార‌నేది వాస్త‌వం. దీనికితోడు 144 చోట్ల పోటీలో ఉన్న టీడీపీలోనూ బ‌ల‌మైన నేత‌లే ఉన్నారు.

దీంతో అటు.. మిత్ర‌ప‌క్షాల నుంచి ఇటు సొంత పార్టీ నుంచి కూడా ప‌ద‌వుల విష‌యంలో చంద్ర‌బాబుకు సెగ త‌ప్ప‌ద‌ని అంటున్నారు. ఉన్న‌ది 25 మంది మంత్రుల పోస్టులు. ఇంత‌కు మించి పోస్టులు పెంచుకోవ‌డానికి కూడా అవ‌కాశం లేదు. దీంతో ఆ పాతిక మందిలో ఎంత మందికి న్యాయం చేస్తార‌నేది చ‌ర్చ‌. పైగా.. జ‌న‌సేన త‌ర‌ఫున రెండు, బీజేపి నుంచి రెండు సీట్లు ఆశిస్తున్న‌వారు కూడా ఉన్నారు. నాదెండ్ల మ‌నోహ‌ర్‌, కందుల దుర్గేష్ వంటివారు.. పోటీలో ఉన్నారు. వీరికి మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌క త‌ప్పదు. పేర్లు మారినా.. జ‌న‌సేన నుంచి ఇద్ద‌రు ఖ‌చ్చితంగా ఉంటారు.

జ‌న‌సేన నుంచి వినిప‌స్తున్న పేర్ల‌లో బొమ్మిడి నాయ‌క‌ర్ కూడా ఉన్నారు. అలానే కొణ‌తాల రామ‌కృష్ణ గెలుపు గుర్రం ఎక్కితే.. ఉత్త‌రాంధ్ర‌కు ప్రాధాన్యం కింద ఆయ‌న‌కు కూడా ఇవ్వ‌క త‌ప్ప‌ద‌నే చ‌ర్చ న‌డుస్తోంది. ఇక‌, బీజేపీ నుంచి కూడా..ఇద్ద‌రు బ‌లంగా పోటీలో ఉన్నారు. విజ‌య‌వాడ వెస్ట్ నుంచి క‌నుక గెలుపు గుర్రం ఎక్కితే.. సుజ‌నా చౌద‌రికి ఖ‌చ్చితంగా చంద్ర‌బాబు ప‌క్క‌న సీటు వేస్తారు. అదేవిధంగా మ‌రో కీల‌క నేత కామినేని శ్రీనివాస‌రావు విష‌యంలోనూ.. బీజేపీ ఒత్తిడి ఖాయంగా ఉండ‌నుంది. దీంతో మిత్ర‌ప‌క్షాల‌కు ఎంత లేద‌న్నా.. 5 నుంచి 8 ప‌దవులు ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ నేప‌థ్యంలో టీడీపీ త‌రఫున బ‌ల‌మైన నాయ‌కులుగా ఉన్న అచ్చెన్నాయుడు, నారా లోకేష్, గంటా శ్రీనివాస‌రావు, ప‌య్యావు ల కేశ‌వ్‌(గెలిస్తే ఖ‌చ్చితంగా మంత్రి ప‌ద‌వి అంటున్నారు) య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి.. వంటివారు ఆస్థాన మంత్రుల‌నే విష‌యం తెలిసిందే. దీంతో కీల‌కమైన నాయ‌కుల‌కు న్యాయం చేస్తారా? లేదా? అన్న‌ది ప్ర‌శ్న‌. ఇలాంటి వారిలో నిమ్మ‌ల రామానాయుడు, ఏలూరి సాంబ‌శివ‌రావు, గొట్టిపాటి ర‌వి, పొంగూరు నారాయ‌ణ వంటి వారు క‌నిపిస్తున్నారు. ఈ లెక్క ఇంకా ఉంది. మ‌రి వీరికి చంద్ర‌బాబు ఏమేర‌కు న్యాయం చేస్తార‌నేది ఆస‌క్తిగా మారింది. పార్టీకి ఐదేళ్లు అహ‌ర‌హం వీరు శ్ర‌మించారు. దీంతో వీరికి న్యాయం చేయాల‌ని పార్టీలో వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.