ఆ ఆరుగురు అదృష్టవంతులు ఎవరు ?

లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. దీంతో తెలంగాణలలో మిగిలిపోయిన ఆరు మంత్రి పదవులు దక్కించుకునే అదృష్టవంతులు ఎవరు ? అనే చర్చ మొదలయింది. ఈ మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఆశావాహులు తమ ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఏఏ సామాజిక వర్గాలకు ఈ సారి విస్తరణలో చోటు లభిస్తుంది ? సీనియర్లను తీసుకుంటారా ? కొత్తవాళ్లకు ప్రాధాన్యం ఇస్తారా ? అధిష్టానం నిర్ణయిస్తుందా ? సీఎం రేవంత్ కు ఛాయిస్ ఇస్తుందా ? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్ నగర్ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అవకాశం ఇస్తానని ప్రకటించాడు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కూడా ఇతడు సన్నిహితుడు కావడం విశేషం. అయితే మహబూబ్ నగర్ లో బీజేపీ నుండి పోటీ చేసిన డీకే అరుణకే విజయావకాశాలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో శ్రీహరికి మంత్రి వర్గంలో బెర్త్ లభిస్తుందా ? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇక భువనగిరి లోక్ సభ స్థానానికి తన సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని రేవంత్ నిలబెట్టాడు. ఇక్కడ అభ్యర్థిని గెలిపిస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రి వర్గంలోకి తీసుకుంటాం అన్న సంకేతాలు ఇచ్చాడు రేవంత్. అయితే ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా ఉన్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి అవకాశం లభిస్తుందా ? అన్నది అనుమానమే.

తెలంగాణలో ముదిరాజ్ లతో పాటు కురుమల ప్రాబల్యమూ అధికమే. ఈ నేపథ్యంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు అవకాశం లభిస్తుందని, మున్నూరు కాపు సామాజిక వర్గం నుండి ఎమ్మెల్పీ బల్మూర్ వెంకట్ లేదా ఆది శ్రీనివాస్ కు అవకాశం లభిస్తుందని అంటున్నారు. గిరిజన సామాజిక వర్గం నుండి నల్లగొండ, వరంగల్ జిల్లాలకు అవకాశం లభిస్తుందని చెబుతున్నారు.

మంత్రివర్గంలో ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు ఛాన్స్ దక్కే ఉంది. నిజామాబాద్ నుండి మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ పేరు వినిపిస్తుంది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరు వినిపిస్తున్నా ఇప్పటికే మంత్రులలో రెడ్డిల సంఖ్య మించిపోవడంతో అవకాశాలు తక్కువే అని చెప్పాలి. ఈ నేపథ్యంలో మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయో అన్న చర్చ జోరుగా నడుస్తున్నది.