ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: ఫ‌స్ట్ టైం మోడీ.. రాజీవ్ జ‌పం!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ నోటి వెంట కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నాయ‌కుడు, దివంగ‌త ప్ర‌ధాని రాజీవ్ గాంధీ జపం వినిపించింది. నిజానికి గ‌త ప‌దేళ్ల కాలంలో గాంధీ ల కుటుంబాన్ని తిట్ట‌డ‌మే త‌ప్ప‌.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసింది.. సాధించింది.. ఏమీ లేదని ఆ పార్టీ నాయ‌కులు త‌ర‌చుగా విమ‌ర్శిస్తుంటారు. ఎన్నిక‌ల వేళ అయితే.. నెహ్రూ హ‌యాం నుంచి గాంధీల హ‌యాం వ‌ర‌కు కూడా.. మోడీ విరుచుకుప‌డుతూనే ఉన్నారు. ఇటీవ‌ల కూడా.. తాము అధికారంలోకి వ‌స్తే.. పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌(పీవోకే)ను సొంతం చేసుకుంటామ‌న్నారు.

అంతేకాదు… పీవోకేను పాక్ ఆక్ర‌మించ‌డానికి నెహ్రూ, గాంధీల కుటుంబ‌మే కార‌ణ‌మ‌ని మోడీ స‌హా బీజేపీ నేత‌లు చెప్పుకొచ్చారు. గాంధీల కుటుంబం 60 ఏళ్ల‌పా టు ఈ దేశాన్ని ఏలినా.. ఏ నాడూ పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌ను వెన‌క్కి తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేయ‌లేద‌న్నారు. ఇక‌, మ‌త ప‌రంగా.. కూడా కాంగ్రెస్ ముస్లింల‌కు ద‌న్నుగా ఉందంటూ.. గాంధీల కుటుంబంపై మోడీ విరుచుకుప‌డుతూనే ఉన్నారు. అయితే.. అనూహ్యంగా ఆయ‌న నోటి నుంచి రాజీవ్ గాంధీపై ప్ర‌శంస‌లు.. ఆవేద‌న‌, ఆందోళ‌న అన్నీ ఒక్క‌సారిగా వ‌చ్చాయి.

మంగ‌ళ‌వారం(మే 21) రాజీవ్ గాంధీ వ‌ర్దంతి. ఆయ‌న 1991లో ఎన్నికల ప్ర‌చారానికి తమిళ‌నాడులోని పెరుంబ‌దూర్‌కు వెళ్లిన‌ప్పుడు మాన‌వబాంబు ఆయ‌న‌ను పొట్ట‌న పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఈ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని మోడీ.. తొలిసారి రాజీవ్‌కు ఎక్స్ వేదిక‌గా నివాళుల‌ర్పించారు. గ‌తంలో అంటే.. ఈ 9 సంవ‌త్స‌రాల కాలంలో ఏనాడూ ఆయ‌న రాజీవ్ స్మ‌ర‌ణ చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

మ‌రి ఇప్పుడు ఎందుకు చేశారంటే.. కీల‌క‌మైన ఆరు, ఏడోద‌శ‌ల్లో ఎన్నిక‌లు మిగిలి ఉన్నాయి. పైగా.. ఇంతో అంతో గాంధీలు పుంజుకుంటున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆ హ‌వాను త‌న వైపు తిప్పు కోవ‌డం కోసం.. మోడీ ఈ వ‌ర్ధంతిని వినియోగించుకున్నార‌ని.. కాంగ్రెస్ నేత‌లు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇదిలావుంటే.. దేశంలో ఐటీ విప్ల‌వానికి పునాదులు వేసింది.. రాజీవ్ గాంధీ. అప్ప‌టి పంచ‌వ‌ర్ష ప్ర‌ణాళికలో ఆయ‌న‌.. వీటిని ప్ర‌ధానంగా చేర్చారు. అందుకే.. ఇప్ప‌టికీ.. ఐఐటీల‌కు.. ఐఐఎంల‌కు.. ఐటీ వంటి సంస్థ‌ల‌కు.. జాతీయ స్థాయిలో ఆయ‌న పేరునే కొన‌సాగిస్తున్నారు.