ఆ నేత పంతం.. కుమార్తెకు ఎస‌రు పెడుతోందా?

రాజ‌కీయాల్లో అన్ని వేళ‌లా పంతమే ప‌నికిరాదు. ఒక్కొక్క‌సారి ప‌ట్టు విడుపులు కూడా ముఖ్య‌మే. ఈ విష‌యంలో నాయ‌కులు, పార్టీలు కూడా.. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తాయి. ఎంతో ప‌ట్టుద‌ల‌కు పోయిన నాయ‌కులు కూడా.. ప‌రిస్థితుల‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించి దిగి వ‌చ్చిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వ‌స్తోందంటే.. విజ‌య‌న‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గం లో చోటు చేసుకున్న ప‌రిణామాలే కార‌ణం.

విజ‌య‌న‌గ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పూస‌పాటి అశోక్ గజ‌ప‌తి రాజు కుమార్తె అదితి గ‌జ‌ప‌తి రాజు పోటీ చేశారు. అయితే.. ఆమె వైసీపీ కంటే కూడా.. అస‌లు స‌మ‌స్య‌.. సొంత పార్టీ నాయ‌కురాలు.. మీసాల గీత నుంచే ఎదురైంది. గ‌తంలో విజ‌యం ద‌క్కించుకున్న గీత‌.. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లోనూ టికెట్ ఆశించారు. కానీ, ఆమెకు ద‌క్క‌లేదు. దీంతో రెబ‌ల్‌గా అయినా.. పోటీ చేస్తాన‌ని ముందుగానే ప్ర‌కటించారు. దీంతో స్తానిక నాయ‌క‌త్వం అలెర్ట‌యింది.

పార్టీ అధినేత చంద్ర‌బాబుకూడా.. ఆమెను బుజ్జ‌గించాల‌ని సూచించారు. దీంతో కిమిడి నాగార్జున వంటి వారు ఆమెను బుజ్జ‌గిం చారు. పార్టీ అదికారంలోకి వ‌స్తే.. ఎమ్మెల్సీ ఇస్తామ‌ని చంద్ర‌బాబు చెప్ప‌మన్న‌ట్టు చెప్పుకొచ్చారు. కానీ.. ఆమె అంగీక‌రించ‌లేదు. “అశోక్ గ‌జ‌ప‌తి రాజు త‌నకు ఫోన్ చేసినా.. స్వ‌యంగా వ‌చ్చినా.. వింటా”న‌ని అన్నారు. దీంతో బాల్.. అశోక్ గ‌జ‌ప‌తి కోర్టులోకి వెళ్లింది. కానీ, గ‌తంలో ఉన్న రాజ‌కీయ విభేదాల కార‌ణంగా.. ఆమెను బుజ్జ‌గించేందుకు అశోక్ ముందుకు రాలేదు.

పైగా.. త‌న కుమార్తె మ‌రోసారి ఓడిపోయినా త‌న‌కు ఇబ్బంది లేద‌ని బాహాటంగా చెప్పారు. దీంతో మీసాల గీత ఇండిపెండెంట్‌గా నామినేష‌న్ వేసి భారీగా ప్ర‌చారం చేసుకున్నారు. అంతేకాదు.. త‌న‌కు ఎన్నిక‌ల గుర్తుగా.. ‘గాజు గ్లాసు’ను తీసుకున్నారు. ఈ ప‌రిణామం.. అదితి గ‌జ‌ప‌తి రాజుకు ఇప్పుడు పోలింగ్ త‌ర్వాత‌ తీవ్ర సంక‌టంగా మారిపోయింది. ఊరూ వాడా తిరుగుతూ.. తాను ఇక్క‌డే ఉంటాన‌ని.. అంకిత భావంతో ప‌నిచేస్తాన‌ని చెప్పినా.. భారీగా జ‌రిగింద‌ని భావిస్తున్న క్రాస్ ఓటింగ్ అదితికి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నార‌. జూన్ 4 అంటేనే ఆమెకు గీత రూపంలో సుడిగుండం ఎదురుగా క‌నిపిస్తున్న‌ట్టు ఉంద‌ట‌!

దీనికి కార‌ణం.. అశోకేన‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. ఒక్క మెట్టు దిగి వ‌చ్చి.. ఆయ‌న స‌హ‌క‌రించి ఉంటే.. గీత పోటీ నుంచి త‌ప్పుకొనే వార‌ని.. అప్పుడు అదితి విజ‌యంపై అంచ‌నాలు పెరిగి ఉండేవ‌ని అంటున్నారు. కానీ, అశోక్ ఒక్క మెట్టు కూడా దిగిరాలేదు. చిత్రం ఏంటంటే.. ఎన్నిక‌ల‌కు ముందు వ‌చ్చిన అన్ని స‌ర్వేల్లోనూ.. విజ‌య‌న‌గ‌రంలో గీత గ‌ట్టి పోటీఇస్తున్నార‌ని చెప్పుకొచ్చాయి. ఇక‌, పోస్ట్ పోల్ స‌ర్వే రాక‌పోయినా.. విశ్లేష‌ణల్లోనూ.. గీత గురించేఎక్కువ‌గా చ‌ర్చ సాగుతుండ‌డం.. క్రాస్ ఓటింగ్ జ‌రిగింద‌ని అంచ‌నాలు పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో జూన్ 4న తేల‌నుంది.