మ‌రో వివాదంలో టీడీపీ ఫైర్ బ్రాండ్.. దెందులూరు హాట్ హాట్‌!

టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ మ‌రో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నిక‌ల అనంతరం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలోనూ కొంత మేర‌కు అల్ల‌ర్లు జ‌రిగాయి. ముఖ్యంగా చింత‌మ‌నేనికి బ‌ల‌మైన ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని పెద‌వేగి మండ‌లంలో ఈ ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకున్నాయి. వీటిని స్థానిక పోలీసులు.. ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని విచార‌ణ చేశారు. ఈ క్ర‌మంలో చింత‌మ‌నేని అనుచ‌రుల‌పై కేసులు పెట్టివారిని స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

ఈ విష‌యం తెలిసిన చింత‌మ‌నేని.. నేరుగా స్టేష‌న్ వెళ్లి.. ఉన్న‌తాధికారులు లేని స‌మ‌యంలో త‌న అనుచ‌రుల‌ను విడిపించుకుని వెళ్లిపోయారు. దీంతో చింత‌మ‌నేనిపై కూడా పోలీసులు కేసులు పెట్టారు. స్టేష‌న్‌పై దౌర్జ‌న్యం చేశార‌న్న కోణంలో ఆయ‌న‌ను కూడా విచారించేందుకు రెడీ అయ్యారు. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే చింత‌మ‌నేని నియోజ‌క‌వ‌ర్గం స‌హా జిల్లాను కూడా వ‌దిలి అజ్ఞాత ప్రాంతానికి వెళ్లిపోయార‌ని.. ఆయ‌న వ‌ర్గం నేత‌లు చెబుతున్నారు. అనుచ‌రుల‌ను, చింత‌మ‌నేనిని కూడా అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

ఏం జ‌రిగింది?

రాష్ట్రంలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగిన ఈ నెల 13న పెద‌వేగి మండ‌లంలోని ఓ పోలింగ్ బూత్ స‌మీపంలో ఓ వ్య‌క్తిపై హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. దీనివెనుక చింత‌మ‌నేని అనుచ‌రులు ఉన్నార‌నేది బాధితుడు చెబుతున్న వాద‌న‌. దీంతో ప్ర‌ధాన అనుచ‌రుడు రాజ‌శేఖ‌ర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించి.. మ‌రో 18 మందిని కూడా అరెస్టు చేశారు. వీరిని స్టేష‌న్ నుంచి బ‌ల‌వంతంగా తీసుకువెళ్లార‌నేది చింత‌మ‌నేనిపై ఉన్న ఆరోప‌ణ‌. అడ్డుకోబోయిన పోలీసులతో కూడా చింత‌మ‌నేని వాగ్వాదానికి దిగార‌ని అంటున్నారు. దీంతో ఆయ‌న‌పై కూడా కేసులు న‌మోదు చేశారు. ప్ర‌స్తుతం చింత‌మ‌నేన‌ని కోసం పోలీసులు గాలిస్తున్న‌ట్టు తెలిసింది.