పవన్ అభిమానులను టెన్షన్ పెట్టేసిన మోడీ

సోషల్ మీడియా కాలంలో ప్రతి చిన్న విషయమూ వార్తే. సోషల్ మీడియాలో ఒక ప్రముఖుడు ఇంకో ప్రముఖుడికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం.. అవతలి నుంచి బదులు రావడం.. రాకపోవడం.. ఇవి కూడా చర్చనీయాంశాలే అయిపోతున్నాయి. గురువారం ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజన్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా రాజకీయ, సినీ, వ్యాపార వర్గాల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆయన్ని ప్రశంసల్లో ముంచెత్తుతూ జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. అందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. కొంత కాలంగా బీజేపీతో కలిసి సాగుతూ, ఆ పార్టీని బాగా ఓన్ చేసుకుని మోడీని మెప్పించడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్న పవన్.. ప్రధానిని పొగుడుతూ ఉదయమే ట్విట్టర్లో జన్మదిన శుభాకంక్షలు చెప్పాడు.

ఐతే సాయంత్రం మోడీ తనకు శుభాకాంక్షలు చెప్పిన ప్రముఖులు ఒక్కొక్కరికి ధన్యవాదాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఐతే టాలీవుడ్ నుంచి పవన్ అన్నయ్య చిరంజీవితో పాటు మహేష్ బాబు, అక్కినేని నాగార్జునలకు మోడీ చాలా ముందుగానే బదులిచ్చాడు. వారికి కృతజ్ఞతలు చెప్పాడు. కానీ పవన్ కళ్యాణ్‌కు మాత్రం జవాబు రాలేదు. ఆ తర్వాత వివిధ రంగాలకు చెందిన వేరే వ్యక్తులు ఒక్కొక్కరికి శుభాకాంక్షలు చెబుతూ వెళ్లాడు. పవన్‌తో పాటు చంద్రబాబుకు కూడా ఆయన జవాబివ్వలేదు. దీంతో వీళ్లిద్దరి ఉద్దేశపూర్వకంగా విస్మరించాడన్న ప్రచారం జరిగింది.

చంద్రబాబుతో అయితే స్నేహం తెగిపోయిది.. కానీ మిత్ర పక్షానికి చెందిన పవన్‌ను ఎందుకు ఇగ్నోర్ చేశాడో జనాలకు అర్థం కాలేదు. కొందరు ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ పవన్ అభిమానులను ఎగతాళి చేయడం కూడా మొదలుపెట్టారు. కొన్ని వెబ్ సైట్లలోనూ దీనిపై వార్తలు మొదలయ్యాయి. పొరబాటున మరిచిపోతే మరిచిపోయి ఉండొచ్చు.

లేదా కొంచెం ఆలస్యం అయ్యుండొచ్చు. కానీ ఈలోపు ఇదొక చర్చనీయాంశంగా మారింది. పవన్‌కు జవాబివ్వకుండానే మోడీ నిష్క్రమిస్తే వ్యతిరేక వర్గాల దాడిని తట్టుకోవడం కష్టమని పవన్ అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. కానీ కొన్ని గంటల తర్వాత మోడీ.. పవన్‌కు బదులిచ్చి వాళ్ల టెన్షన్ తీర్చేశాడు. పనిలో పనిగా చంద్రబాబుకు కూడా మోడీ కృతజ్ఞతలు చెప్పడం విశేషం.