పవన్‌కు ప్రాణం, జగన్‌కు ఓటు.. మారుతుందా?

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో యూత్‌లో పవన్‌కు ఉన్నది మామూలు క్రేజ్ కాదు. సినిమాల్లో సూపర్ స్టార్ ఇమేజ్ వల్ల పవన్ యువతలో భారీగా క్రేజ్ సంపాదించుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చాక కూడా యూత్‌లో తన క్రేజ్ ఉపయోగపడుతుందని ఆశించారు. కానీ పవన్‌ను చూడగానే వెర్రెత్తిపోయి కేకలు పెట్టే అభిమానులు.. ఎన్నికల్లో మాత్రం ఆయనకు ఆశించిన స్థాయిలో అండగా నిలవలేదు.

ఈ విషయమై పవన్‌ స్వయంగా ఎన్నోసార్లు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రత్యర్థులు.. పవన్‌ను తరచుగా దీనిపై ఎగతాళి చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఒక నానుడి బాగా పాపులర్ అయింది. “పవనన్నకు ప్రాణమిస్తాం.. జగనన్నకు ఓటేస్తాం” అనే బాపతు అభిమానులే పవన్‌కు ఎక్కువగా ఉన్నారని అంటుంటారు.

ఐతే 2019 ఎన్నికల ట్రెండ్స్‌ను గమనిస్తే యూత్‌లో చాలామంది ఈ స్లోగన్‌నే ఫాలో అయిన విషయం అర్థమవుతుంది. ఈ పరిస్థితి మారితేనే జనసేనకు ప్రస్తుత ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఐతే క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే మార్పు స్పష్టమని అర్థమవుతోంది. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని జగన్‌కు అండగా నిలిస్తే.. ఆయన ఆ విషయంలో చేసింది ఏమీ లేదనే అసంతృప్తి యువతలో చాలా ఉంది. ప్రస్తుతం ఏపీలో తీవ్ర అసంతృప్తితో ఉన్న వర్గాల్లో యువత ముందుంటుంది.

రెండు చోట్లా ఓడినా బలంగా నిలబడిన పవన్‌కు ఈసారి అండగా నిలవాలనే ఆలోచన యువతలో కలుగుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కాపు యువత ఈసారి పవన్‌కు గట్టి మద్దతు ఇస్తుందని.. ఈసారి మాత్రం అభిమానులు పవన్‌కు ప్రాణమిస్తాం అనడమే కాదు కాదు, ఓటు కూడా వేస్తారని జనసేన ఆశిస్తోంది.