జగన్ వన్ సైడ్ లవ్

కేసులు కావొచ్చు ఇత‌ర స్వార్థ ప్ర‌యోజ‌నాలు కావొచ్చు ఇన్నేళ్లుగా కేంద్రంలోని ఎన్డీయే కూట‌మి స‌ర్కారుకు, ప్ర‌ధాని మోడీకి ఏపీ సీఎం జ‌గ‌న్ వంగి వంగి దండాలు పెట్టారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఏనాడూ ప్ర‌శ్నించ‌ని ఆయ‌న సొంత ప‌నులే చూసుకున్నార‌నే విమ‌ర్శ‌లున్నాయి. రాష్ట్రానికి ద‌క్కాల్సిన ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం నిధులు త‌దిత‌ర వాటి గురించి కూడా కేంద్రాన్ని ప్ర‌శ్నించ‌లేక‌పోయారు. ఏమైనా అడిగితే జైల్లో వేస్తారేమో అన్న భ‌య‌మే అందుకు కార‌ణ‌మ‌నే టాక్ ఉంది. అందుకే బీజేపీ ప్ర‌భుత్వానికి త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని జ‌గ‌న్ చెబుతూ వ‌స్తున్నారు. కానీ ఇప్పుడు మోడీ కొట్టిన దెబ్బ‌కు జ‌గ‌న్‌కు దిమ్మ‌తిరిగింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ జ‌త క‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌ను గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ కూట‌మి సాగుతోంది. కానీ జ‌గ‌న్ మాత్రం అవ‌స‌ర‌మైతే కేంద్రంలోని ఎన్డీయే స‌ర్కారుకు మ‌ద్ద‌తునిస్తామ‌ని ఇటీవ‌ల వ్యాఖ్యానించారు. బీజేపీని విమ‌ర్శించి లేనిపోని త‌ల‌నొప్పి తెచ్చుకోవ‌డం ఎందుకు అనే ఉద్దేశంతో జ‌గ‌న్ ఉన్నార‌నే చెప్పాలి. కానీ మోడీ మాత్రం టైమ్ చూసి జ‌గ‌న్‌ను టార్గెట్ చేశార‌నే టాక్ వినిపిస్తోంది. ఇన్ని రోజులు బీజేపీ నుంచి ఎలాంటి విమ‌ర్శ‌లు రాక‌పోవ‌డంతో జ‌గ‌న్ ఊపిరి తీసుకున్నారు. మొద‌టి ప్ర‌చార స‌భ‌కు హాజ‌రైన‌ప్పుడు కూడా జ‌గ‌న్ గురించి, వైసీపీ ప్ర‌భుత్వం గురించి మోడీ ఎక్కువ‌గా ప్ర‌స్తావించ‌లేదు. దీంతో బీజేపీతో స‌త్సంబంధాలు బాగానే ఉన్నాయ‌నే భ్ర‌య‌లో వైసీపీ ఉండిపోయింది.

ఇప్పుడు తాజాగా ఏపీలో ప్ర‌చార స‌భ‌ల్లో జ‌గ‌న్‌పై, వైసీపీ ప్ర‌భుత్వంపై మోడీ విరుచుకుపడ్డారు. వైసీపీ ప్ర‌భుత్వానికి కౌంట్‌డౌన్ మొద‌లైంద‌ని అన్నారు. ఏపీలో డ‌బుల్ ఇంజిన్ స‌ర్కారు ఏర్పాటు ఖాయ‌మ‌న్నారు. రాయ‌ల‌సీమ చాలా మంది ముఖ్య‌మంత్రుల‌ను ఇచ్చింద‌ని, కానీ ఎవ‌రూ స‌రైన న్యాయం చేయ‌లేద‌ని మోడీ అన్నారు. మాఫియా కోస‌మే వైసీపీ ప‌నిచేస్తుంద‌ని విమ‌ర్శించారు. దీంతో జ‌గ‌న్‌కు గ‌ట్టి దెబ్బ ప‌డింద‌ని అంటున్నారు. ఇప్పుడు మోడీ, బీజేపీపై విమ‌ర్శ‌లు చేసేంత ధైర్యం జ‌గ‌న్‌కు కానీ వైసీపీకి కానీ లేవు. మ‌రోవైపు మోడీ ప్ర‌చార స‌భ‌తో చంద్ర‌బాబు, ప‌వ‌న్ స‌రికొత్త ఉత్సాహంతో స‌మ‌రానికి సై అంటున్నారు.