బీహార్ లో బీజేపీ కోటకు బీటలు !

బీహార్ లో బీజేపీ కోటకు బీటలు వారుతున్నాయి. 2019 ఎన్నికలలో బీజేపీ, జేడీయూ, ఎల్జేపీలతో కూడిన ఎన్డీఏ కూటమి బీహార్ లోని 40 స్థానాలకు గాను 39 స్థానాలు గెలుచుకుని విజయదుందుబి మోగించింది. కానీ ఈ సారి ఆ పరిస్థితులు కనిపించడం లేదు. అక్కడ 40 లోక్ సభ స్థానాలకు గాను ఇప్పటికే 14 స్థానాలలో పోలింగ్ ముగిసింది. మరో 26 స్థానాలలో పోలింగ్ జరగాల్సి ఉంది. ఇప్పటి వరకు మూడు దశలలో జరిగిన పోలింగ్ లో ఓటింగ్ శాతం తగ్గిపోవడం బీజేపీని కలవరపెడుతున్నది.

గత ఎన్నికలకు, ఈ ఎన్నికలకు బీహార్ లో మారిన పరిస్థితులు బీజేపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. గత ఎన్నికల్లో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) ఇప్పుడు రెండుగా చీలింది. రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ సోదరుడు పశుపతి కుమార్‌ పరాస్‌ నేతృత్వంలో ఏర్పడిన రాష్ట్రీయ లోక్‌ జనశక్తి పార్టీ(ఆర్‌ఎల్‌జేపీ) ఎన్డీఏ నుంచి బయటకు రావడం ఎన్డీయేకు మైనస్‌గా మారింది. బీహార్‌కు తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న నితీశ్‌ కుమార్‌ ప్రభావం క్రమంగా తగ్గుతున్నది.

మొన్నటి వరకు ఇండియా కూటమిలో ఉండి బీజేపీని తీవ్రంగా విమర్శించిన నితీష్ కుమార్ ప్రస్తుతం బీజేపీతో జతకట్టడం మూలంగా ప్రజలలో విశ్వసనీయత కోల్పోయారు. పదేండ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం, రాష్ట్రంలో నితీష్ కుమార్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఎన్డీఎ విజయావకాశాలను దెబ్బతీస్తున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నిరుద్యోగం, ధరల పెరుగుదల అంశాలలో కేంద్రంపై ప్రజలు గుర్రుగా ఉన్నట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి.

గత శాసనసభ ఎన్నికలలో ఆర్జేడీని అతిపెద్ద పార్టీగా నిలిపిన లాలూ వారసుడు తేజస్వీ యాదవ్ ఎన్డీఎ కూటమికి సవాల్ గా నిలిచాడు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆర్జేడీ ఈసారి ఎన్నికలలో 40 స్థానాలకు గాను 25 స్థానాలలో పోటీ చేస్తున్నది. బీహార్ లోని సామాన్యులతో పాటు యువత తేజస్వీ పట్ల ఆకర్షితులయ్యారు. ఈ నేపథ్యంలో తేజస్వీ ఛరీష్మా ముందు అక్కడ మోడీ హవా తేలిపోతున్నది. గత ఎన్నికలలో ఉన్న ఏకపక్ష తీర్పు ఈసారి బీహార్ లో రావడం అసాధ్యం అని ఎన్డీఎ నేతలే చెబుతున్నారు.