తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో వాస్తు మార్పులు?

హోరాహోరీగా సాగుతున్న ఏపీ ఎన్నికల యుద్ధం మరో వారం రోజుల్లో ఒక కొలిక్కి రావటంతో పాటు.. ఎన్నికల్లో కీలక అంకమైన పోలింగ్ దశకు చేరుకోనుంది. ఇలాంటి వేళలో ఎంతటి హడావుడి నెలకొని ఉంటుందో తెలిసిందే. రెండోసారి అధికారాన్ని ఎట్టి పరిస్థితుల్లో సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు రచించటంతో పాటు.. రోజువారీ ప్రచారంతో దూసుకెళుతున్నారు. అయితే ఎన్ని చేసినా ఏదో అనుమానం వెంటాడుతోందట. అందుకే ఎందుకైనా మంచిదని ఇంటి వాస్తు చూపించారట.

వాస్తు నిపుణుడి సలహా మేరకు తాడేపల్లిలోని తన నివాసంలో వాస్తు మార్పులు చేపట్టినట్లుగా చెబుతున్నారు. తాడేపల్లి ప్యాలెస్ లోపల ఏం జరుగుతుంది? ఎవరెవరు ఉన్నారు? లాంటివి దగ్గర్లోని అపార్టుమెంట్ నుంచి చూస్తే కనిపించేలా ఉండేది. దీంతో.. భవనం చుట్టూ ఎత్తైన గోడలు నిర్మించారు. దీనికి ఐరెన్ రాడ్లను నిర్మించారు. దీంతో.. కాస్త దగ్గర నుంచి చూసినా.. జగన్ నివాసం పోర్టికోలో ఎవరున్నారన్న విషయం తెలిసే పరిస్థితి లేదు.
ఇదిలా ఉంటే.. కీలకమైన ఎన్నికల వేళ.. ఇంటి మూల ఉన్న ప్రహరీని తొలగించినట్లుగా చెబుతున్నారు. వాస్తు నిపుణులు చేసిన సూచనలతోనే ఈ మార్పులు చేపట్టినట్లుగా చెబుతున్నారు.

ఊపిరి సలపని పనులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ముఖ్యమంత్రి జగన్.. తన ఇంట్లో జరుగుతున్న వాస్తు మార్పుల్ని దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో మరింత సానుకూలత కోసమే తాజా మార్పులు చేసినట్లుగా చెబుతున్నారు.