కూట‌మిపై పిడుగు.. ఈసీ నిర్ణ‌యంతో తీవ్ర ఇబ్బంది!

కీల‌క‌మైన ఎన్నిక‌లు.. వైసీపీని ఓడించి తీరాల‌న్న బ‌ల‌మైన సంక‌ల్పం. అంతేకాదు.. అధికారంలోకి వ‌చ్చి తీరాల‌న్న ఆకాంక్ష‌.. ఈ నేప‌థ్యంలోనే మూడు పార్టీలు కూట‌మిగా వ‌చ్చాయి. టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన‌లు రంగంలోకి దిగాయి. ఇప్ప‌టికే పెద్ద ఎత్తున ప్ర‌చారం కూడా చేస్తున్నాయి. ఒక్క వ్య‌తిరేక ఓటు కూడా చీల‌కూడ‌ద‌న్న‌ది ప్ర‌ధాన సంక‌ల్పం.ఇలానే పార్టీలు ప్ర‌చారం కూడా చేస్తున్నాయి. కానీ, ఇంత చేసినా.. ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌య్యే క్ర‌మంలో కూట‌మిపై పెను పిడుగు ప‌డింది. అది కూడా ప్ర‌జ‌ల‌ను, ఓట‌ర్ల‌ను భారీ ఎత్తున ప్ర‌భావితం చేసే అంశం కావ‌డంతో దీనిపై కూట‌మి అధినేత‌లు.. మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు.

ఏం జ‌రిగింది?  

ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో కూట‌మి పార్టీల త‌ర‌ఫున బ‌రిలో ఉన్న జ‌న‌సేన 175 అసెంబ్లీ స్థానాల్లో 21 చోట్ల‌, పాతిక పార్ల‌మెంటు స్థానాల్లో రెండు చోట్ల పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇక‌, ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ, బీజేపీలు పోటీలో ఉండ‌వు. మ‌రోవైపు.. జ‌న‌సేన‌కు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. ఆ పార్టీ అభ్య‌ర్థులు ఈ గుర్తుపైనే పోటీ చేయ‌నున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. ఇప్పుడు స్వ‌తంత్ర అభ్య‌ర్థులుగా రాష్ట్ర వ్యాప్తంగా వంద‌ల మంది పోటీ లో ఉన్నారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ ప్ర‌క్రియ పూర్తయిన త‌ర్వాత‌.. కూడా వేల మంది బ‌రిలోనే ఉన్నారు. అయితే.. వీరిలో మెజారిటీ అంటే.. దాదాపు 17 వంద‌ల మందికి ఎన్నిక ల గుర్తుగా గాజు గ్లాసును కేటాయించారు.

జ‌న‌సేన అభ్య‌ర్థులు పోటీలో లేని 154 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో, 23 పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేస్తున్న స్వ‌తంత్ర అభ్య‌ర్థుల‌కు మెజారిటీ భాగం గాజు గ్లాసును కేటాయించారు. ఇది కూట‌మి పార్టీల‌కు ఇబ్బందిగా మారింది. ఎందుకంటే.. జ‌న‌సేన పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. పైగా జ‌న‌సేన పార్టీ గుర్తు కూడా.. ఇదే కావ‌డంతో వారంతా .. తెలిసో తెలియ‌కో.. గాజు గ్లాసుకే ఓటే వేస్తే.. అది కూట‌మి పార్టీల అభ్య‌ర్థుల‌ను ఓడించ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది.

దీంతో అలెర్ట‌యిన కూట‌మి పార్టీలు దీనికి సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి వారం కింద‌టే అర్జీలు పెట్టాయి. కానీ, ఎన్నిక‌ల సంఘం మాత్రం వీరి విన్న‌పాలు ప‌ట్టించుకోలేదు. తాజాగా నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ కూడా పూర్త‌యిన ద‌రిమిలా.. స్వ‌తంత్ర అభ్య‌ర్థుల‌కు గుర్తుల‌ను కేటాయించేశారు. దీంతో ఇక‌, ఆయా గుర్తుల‌ను వెన‌క్కి తీసుకునే అవ‌కాశం లేదు. ఈ ప‌రిణామం.. కూట‌మిపై పెను ప్ర‌భావం చూపిస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. జ‌నసేన పార్టీ రిజిస్ట‌ర్ పార్టీ కాక‌పోవ‌డం. అంటే.. గుర్తింపు పొందిన పార్టీ కాక‌పోవ‌డ‌మే.