భ‌ర్త ప‌ద‌వి భార్య‌కు.. జ‌గ‌న్ మంత్రం?

ఉమ్మ‌డి శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ కుటుంబ పోరును సీఎం జ‌గ‌న్ సెట్ రైట్ చేశారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో విజ‌యం ద‌క్కించుకుని తీరాల‌ని క‌సితో ఉన్న సీఎం జ‌గ‌న్‌.. ఇక్క‌డ త‌లెత్తిన భార్యాభ‌ర్త‌ల వివాదాన్ని త‌న‌దైన శైలిలో ప‌రిష్క‌రించారు. టెక్కలి నుంచి టీడీపీ రాష్ట్ర చీఫ్ అచ్చెన్నాయుడు పోటీలో ఉన్న విష‌యం తెలిసిందే. ఈయ‌న‌ను ఓడించి తీరాల‌నేది సీఎం జ‌గ‌న్ పంతం. ఈ క్ర‌మంలోనే ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు దువ్వాడ శ్రీనివాస్‌కు ఆరు మాసాల ముందే.. టికెట్ ప్ర‌క‌టించారు. కానీ, ఏమ‌నుకున్నారో ఏమో.. జెడ్పీ మెంబ‌ర్‌గా ఉన్న శ్రీనివాస్ భార్య‌.. వాణికి త‌ర్వాత‌..టికెట్ ఇస్తామ‌ని చెప్పారు.

దీంతో వాణి పేరు దాదాపు ఒక ద‌శ‌లో ఖ‌రారైంది. జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌తో ఆమె ప్రచారానికి కూడా రెడీ అయిపోయారు. తీరా ఎన్నిక‌ల వేళ‌కు వ‌చ్చేస‌రికి మ‌ళ్లీ జ‌గ‌న్ మ‌న‌సు మార్చుకుని దువ్వాడ శ్రీనివాస్‌వైపే మొగ్గు చూపారు. కానీ, వాణి మాత్రం పోటీ నుంచి త‌ప్పుకొనేది లేద‌ని తేల్చి చెప్పారు. త‌న భ‌ర్తఅయినా.. స‌రే.. వెన‌క్కి త‌గ్గేది లేద‌న్నారు. వెంట‌నే ఇండిపెండెంట్‌గా నామినేష‌న్ కూడా వేసేశారు. మ‌రోవైపు దువ్వాడ శ్రీనివాస్‌ను జ‌గ‌న్ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు. దీంతో భార్యాభ‌ర్త‌లు ఇద్ద‌రూ ఒకే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ ప‌డ‌డంతో వైసీపీ ఓటు బ్యాంకు చెదిరి పోవ‌డం ఖాయ‌మ‌ని భావించిన పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది.,

తాజాగా విశాఖ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న జ‌గ‌న్‌.. ఇద్ద‌రినీ అక్క‌డ‌కు పిలుపించుకుని స‌ర్ది చెప్పారు. ముందు వాణి.. సీఎం జ‌గ‌న్‌కు సైతం ఎదురు తిరిగార‌ని స‌మాచారం. తన‌పేరును ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. వెన‌క్కి ఎలా తీసుకుంటార‌ని.. ఇది మంచిది కాద‌ని కూడా ఆమె వాదించిన‌ట్టు స‌మాచారం. అయితే.. సీఎం జ‌గ‌న్ ఆమెను అనున‌యించి.. మ‌నం ఒక ల‌క్ష్యం పెట్టుకునిముందుకు సాగుతున్నామ‌ని.. అచ్చెన్న‌ను ఓడించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని.. ఇప్పుడు పంతాలు ప‌ట్టింపుల‌కు పోయే స‌మ‌యం కాద‌ని న‌చ్చ‌జెప్పారు. అయిన‌ప్ప‌టికీ వాణి మాట విన‌లేదు.
\
దీంతో అరగంట స‌మ‌యం ఇచ్చిన జ‌గ‌న్ త‌ర్వాత‌.. కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్‌ను గెలిపించేందుకు కృషి చేయాల‌ని.. ఆయ‌న గెలిచిన త‌ర్వాత‌.. ఆయ‌న ఎమ్మెల్సీ సీటును మీకు ఇస్తామ‌ని వాణికి బ‌ల‌మైన హామీ ఇచ్చారు. దీంతో వాణి మెత్త‌బ‌డ్డారు. తాను పోటీ నుంచి త‌ప్పుకొంటాన‌ని చెప్పారు. వేసిన నామినేష‌న్‌ను కూడా వెన‌క్కి తీసుకుంటాన‌ని వెల్ల‌డించారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్‌కు లైన్ క్లియ‌ర్ అయింది.