‘తండ్రి ఆస్తి కొట్టేసి.. చెల్లికి అప్పిస్తావా..’

సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఓ రేంజ్‌లో ఫైర‌య్యారు. ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ సోద‌రి.. కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల .. త‌న నామినేష‌న్ అఫిడ‌విట్‌లో పేర్కొన్న అప్పుల అంశాన్ని చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు. ఈ అఫిడ‌విట్‌లో ష‌ర్మిల‌.. తాను త‌న అన్న జ‌గ‌న్‌కు, వ‌దిన భార‌తికి రూ.82 కోట్ల‌కు పైగా అప్పులు ఉన్నాన‌ని తెలిపారు. త‌ర్వాత ఆమె దీనిపై వివ‌ర‌ణ కూడా ఇచ్చారు. అయితే.. తాజాగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్ర‌బాబు మాట్లాడుతూ.. తండ్రి మొత్తం ఆస్తిని కొట్టేసిన దుర్మార్గుడు జగన్. పైగా చెల్లికే అప్పిస్తావా.. ఈయ‌న‌ను ఏమ‌నాలి సైకో అనే క‌దా! అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

కుటుంబాల్లో ఎవ‌రైనా తోబుట్టువులు క‌ష్టాల్లో ఉంటే ఆదుకుంటార‌ని.. కానీ.. జ‌గ‌న్‌కు అలాంటి బుద్ధి లేద‌ని.. పైగా త‌న పార్టీ కోసం పాద‌యాత్ర చేసిన ష‌ర్మిల‌ను వేధిస్తున్నార‌ని.. ఆమెకే అప్పులు ఇచ్చాడ‌ని.. ఇంత‌క‌న్నా సైకోకి ఇంకే ఉదాహ‌ర‌ణ కావాల‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. వాస్త‌వానికి ష‌ర్మిల త‌న తండ్రి ఆస్తిలో వాటా కోరార‌ని చంద్ర‌బాబు చెప్పారు. అదేమీ జ‌గ‌న్ ముల్లె కాదు. ఇద్ద‌రి తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కూడ‌బెట్టిన ఆస్తి. దానిలో ష‌ర్మిల‌కు న్యాయ‌బ‌ద్ధంగా వాటా ఉంద‌ని ఆమే చెప్పింది. కానీ ఈ సైకో.. వాటా ఇవ్వ‌కుండా.. వ‌డ్డీ వ్యాపారం చేశాడు అని చంద్ర‌బాబు విమ‌ర్శించారు.

సొంత చెల్లెలికే న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకు ఏం చేస్తాడో మీరే తేల్చుకోంది. ఇవి కీల‌క‌మైన ఎన్నిక‌లు .. నాకు-జ‌గ‌న్‌కు జ‌రుగుతున్న‌వి కాదు.. ఈ రాష్ట్రానికి-ఒక సైకో పాల‌న‌కు జ‌రుగుతున్న ఎన్నిక‌లు అని చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. మ‌హిళ ల‌ను ఎంత‌గా వేధిస్తున్నాడో.. వివేకా కుమార్తెను, సొంత చెల్లి ష‌ర్మిల‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంద‌న్నారు. ఇలాంటి సీఎంను మ‌ళ్లీ గెలిపిస్తే.. మిమ్మ‌ల్ని.. మీ బ‌తుకుల‌ను కూడా నాశ‌నం చేస్తాడ‌ని.. మ‌హిళ‌ల‌ను చంద్ర‌బాబు హెచ్చ‌రించారు.

తాము అధికారంలోకి రాగానే.. మ‌హిళ‌ల‌ను నెత్తిన పెట్టుకునేలా ప‌థ‌కాలు తెచ్చామ‌ని.. రూపాయి ఖ‌ర్చులేకుండా మీ పుట్టింటికి వెళ్లేందుకు ఆర్టీసీ బ‌స్సులు వినియోగించుకో వ‌చ్చ‌ని.. పిల్ల‌ల‌ను చ‌దివించుకునేందుకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తామ‌ని చెప్పారు. అంతేకాదు.. మ‌హిళ‌ల‌కు కూడా ఖ‌ర్చులు వుంటాయ‌ని.. అందుకే వారికి ప్యాకెట్ మ‌నీగా నెల‌కు రూ.1500 ఇస్తామ‌ని, ఇంటి గ్యాస్ ఏడాదికి మూడు సిలెండ‌ర్లు ఉచితంగా ఇస్తామ‌ని చెప్పారు. ద‌మ్ముంటే..జ‌గ‌న్ వీటిని ప్ర‌క‌టించాల‌ని అన్నారు.