గులక రాయికే అల్లాడితే గొడ్డలి పోటు సంగతేంటి జగనన్నా?

వివేకా హత్య కేసు గురించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడకూడదంటూ చంద్రబాబు, షర్మిల, పవన్, పురంధేశ్వరిలను కడప కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. గత ఎన్నికలకు ముందు వివేకా హత్య గురించి నారాసుర రక్త చరిత్ర అంటూ కథనాలు నడిపారని, ఇపుడు తాము వివేకా హత్య గురించి ఎందుకు మాట్లాడకూడదని ప్రశ్నించారు.

జగన్‌కు చిన్నరాయి తగిలితేనే హత్యాయత్నమని బ్యానర్ వార్త వేశారని, కానీ, వివేకాను 7 సార్లు గొడ్డలితో నరికి చంపితే సాక్షి పత్రికలో హార్ట్‌ ఎటాక్ అని ఎలా వేయాలనిపించిందో జగన్ సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. తండ్రిని పోగొట్టుకున్న సునీత న్యాయం కోసం ఐదేళ్లుగా పోరాటం చేస్తోందన్నారు.

కడప ఓటర్లు వైఎస్ఆర్, వివేకాలను మరిచిపోలేదని, న్యాయం వైపు నిలబడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే తమను అన్ని విధాలా అడ్డుకుంటోందని ఆరోపించారు. న్యాయం కోసం గొంతెత్తితే అడ్డుకుంటున్నారని విమర్శించారు. భావ ప్రకటనా స్వేచ్చకు సంకెళ్లు వేయడంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకాపై సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆమె ఖండించారు. ప్రజా నాయకులకు వ్యక్తిగత జీవితం ఉండకూడదా? అని ప్రశ్నించారు. జగన్ చేసిన అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ముందా అని నిలదీశారు.

కడప ఎంపీగా ఈ రోజు నామినేషన్ వేసిన తర్వాత షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప, పులివెందుల ప్రజలు మంచి తీర్పు ఇస్తారన్న నమ్మకం తనకుందని, న్యాయం కోసం వైఎస్ఆర్ బిడ్డ ఒకవైపు..వివేకా హత్య కేసు నిందితులు మరోవైపు ఉన్నారని గుర్తు చేశారు. షర్మిల నామినేషన్ కార్యక్రమంలో వివేకా తనయురాలు సునీత, కాంగ్రెస్ సీనియర్ నేత తులసీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాగా, ఎన్నికల అఫిడవిట్ లో షర్మిల త‌న మొత్తం ఆస్తుల విలువ‌ రూ. 182.82 కోట్లు అని పేర్కొన్నారు. చరాస్తులు రూ. 123. 26 కోట్లు కాగా, ఆమె భ‌ర్త అనిల్ కుమార్ రూ. 45 కోట్ల చ‌రాస్తుల‌ు క‌లిగి ఉన్నారు. షర్మిల స్థిరాస్తులు 9.29 కోట్లు, ఆమె భ‌ర్త అనిల్ కు రూ. 4.05 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ష‌ర్మిల వ‌ద్ద 3.69 కోట్ల విలువైన బంగారం, రూ. 4.61 కోట్లు విలువ చేసే జెమ్ స్టోన్స్ ఆభ‌ర‌ణాలు ఉన్న‌ాయని వెల్లడించారు.
తన సోదరుడు జ‌గ‌న్ వ‌ద్ద రూ. 82. 58 కోట్లు, వ‌దిన వైఎస్ భార‌తిరెడ్డి వ‌ద్ద రూ. 19.56 లక్ష‌లు అప్పు తీసుకున్న‌ట్లు అఫిడ‌విట్‌లో పేర్కొన్నారు. షర్మిలపై 8 కేసులున్నాయి. షర్మిలకు ఏడాదికి ఆదాయం రూ. 97.14 లక్ష‌లు, అనిల్ కుమార్ ఆదాయం రూ. 3 ల‌క్ష‌లు అని వెల్లడించారు.