వివేకా పేరు ఎత్త‌కండి.. ఇది చాలా సీరియ‌స్‌ : కోర్టు

“వివేకా పేరు ఎత్త‌కండి.. ఆయ‌న గురించి మాట్లాడ‌కండి.. ఇది చాలా సీరియ‌స్‌ విష‌యం!” అని క‌డ‌ప జిల్లా కోర్టు సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. కొంద‌రు పేర్ల‌ను కూడా త‌న తీర్పులో ప్ర‌స్తావించింది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌, కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌, బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వ‌రి.. చివ‌ర‌కు వివేకా కుమార్తె డాక్ట‌ర్ సునీత‌ల‌కు కూడా కోర్టు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చింది. ఎన్నిక‌ల ప్ర‌చారంలోకానీ.. మీడియాతో మాట్లాడుతున్న స‌మ‌యంలో కానీ.. వివేకా పేరు, ఆయ‌న హ‌త్య‌కు సంబంధించిన ఆరోప‌ణ‌లు చేయ‌డానికి వీల్లేద‌ని తేల్చి చెప్పింది.

ఏం జ‌రిగింది?

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌, టీడీపీ, జ‌న‌సేన స‌హా బీజేపీలు.. వైసీపీ ప్ర‌భుత్వాన్ని, సీఎం జ‌గ‌న్ క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డిల‌ను టార్గెట్ చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ప‌దే ప‌దే వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసును వారు ప్ర‌స్తావిస్తున్నారు. హంత‌కుడు అని, హంత‌కుడికి టికెట్ ఇచ్చార‌ని.. ఇలా ప‌దేప‌దే అనేక సంద‌ర్భాల్లో విమ‌ర్శ‌లు గుప్పించారు. అదేస‌మ‌యంలో వివేకాను దారుణంగా చంపేశారంటూ.. సునీత కూడా.. ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో మీడియా మ‌రింత హైలెట్ చేసింది. ఈ ప‌రిణామాలు వైసీపికి ప్రాణ‌సంక‌టంగా మారాయి.

మ‌రీ ముఖ్యంగా వైఎస్ ష‌ర్మిల‌, సునీత‌లు క‌డ‌ప‌లో చేసిన ప్ర‌చారంలో ఏకంగా.. తీవ్ర వ్యాఖ్య‌లే చేశారు. ఈ నేప‌థ్యంలో వైసీపీ క‌డ‌ప జిల్లా అధ్య‌క్షుడు సురేష్‌బాబు.. క‌డ‌ప కోర్టులో పిటిష‌న్ వేశారు. దీనిని అత్య‌వ‌స‌రంగా విచారించాల‌ని కోర్టును అభ్య‌ర్థించారు. ఈ విన్న‌పం మేర‌కు అత్యవ‌స‌రంగా కేసును విచారించిన కోర్టు.. పైవిధంగా తీర్పు ఇచ్చింది. వివేకా కేసు ప్ర‌స్తుతం న్యాయ ప‌రిధిలో ఉంద‌న్న పిటిష‌నర్ వాద‌న‌ల‌తో కోర్టు ఏకీభ‌వించింది. అదేస‌మ‌యంలో 2019లోనూ ఇదే విధంగా ఎన్నిక‌ల్లో వివేకా అంశాన్ని ప్ర‌చారానికి తెచ్చార‌ని.. కానీ, హైకోర్టు నిలువ‌రించింద‌ని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో కోర్టు పైవిధంగా ఆయా పార్టీల నాయ‌కుల‌కు ఆదేశాలు జారీ చేసింది.