వీర్రాజు ఎఫెక్ట్.. బీజేపీలో క‌న్నా శ‌కం ముగిసిందా?

Kanna Lakshmi Narayana

రాజ‌కీయాలంటే.. రాజ‌కీయాలే! నాయ‌కుల‌ను బ‌ట్టి రాజ‌కీయాలు ఎప్పుడూ శైలిని మార్చుకుంటాయి. ఒక్కొక్క నేత‌ది ఒక్కొక్క స్ట‌యిల్‌. ఇప్పుడు ఏపీ బీజేపీ సార‌థిగా ఉన్న సోము వీర్రాజుది కూడా డిఫ‌రెంట్ స్ట‌యిల్‌. ఆది నుంచి బీజేపీలోనే ఉన్న ఆయ‌నకు ఆర్ ఎస్ ఎస్ మూలాలు కూడా ఉన్నాయి. దీంతో పార్టీని డెవ‌ల‌ప్ చేయాల‌నేది ఆయ‌నకున్న విధానాల్లో ప్ర‌ధాన‌మైంది ఒక‌టైతే.. నాయ‌కుడిగాత‌న‌కు తిరుగులేని ఆధిప‌త్యం సంపాయించుకోవాల‌నేది మ‌రో కీల‌క విధానం. త‌న‌దైన ముద్ర వేయ‌డంతోపాటు.. త‌న‌కు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పే నేత‌ల‌ను లేకుండా చూసుకోవాల‌నేది కూడా సోము వ్యూహంగా క‌నిపిస్తోంది.

తాజాగా ఏపీ బీజేపీకి క‌మిటీని ఏర్పాటు చేసుకున్న సోము.. త‌న వ్యూహాన్ని సంపూర్ణంగా అమ‌లు చేసేశార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక‌టి.. పార్టీకి అనుకూలంగా ఉండేవారికి క‌మిటీలో పెద్ద‌పీట వేశారు. అదేస‌మ‌యంలో త‌న‌కు అనుకూలంగా ఉండేవారికి కూడా అదే రేంజ్‌లో ప్రాధాన్యం క‌ట్ట‌బెట్టారు. లేక‌పోతే.. తాను ఒక‌టి మాట్లాడి.. పార్టీలో ఉన్న నాయ‌కులు మ‌రో గ‌ళం వినిపిస్తే.. మొత్తానికే చేటు తెస్తుంద‌ని అనుకున్న సోము.. దానికి త‌గిన విధంగానే క‌మిటీ ఎంపిక‌లో కెమిస్ట్రీని పండించార‌ని అంటున్నారు. ఇక‌, బీజేపీకి నిన్న మొన్న‌టి వ‌ర‌కు చీఫ్‌గా ఉన్న క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ శ‌కం అంత‌రించేలా కూడా సోము వ్యూహాత్మ‌కంగా చ‌క్రం తిప్పారని చెబుతున్నారు.

క‌న్నా ప‌ద‌విలో ఉన్న‌స‌మ‌యంలో క‌మ్మ సామాజిక వ‌ర్గానికి ప్రాధాన్యం ఇచ్చారు.దీంతో పార్టీలోని రెడ్డి సామాజిక వ‌ర్గం ఒకింత ఆయ‌న‌కు దూర‌మ‌య్యారు. అదేస‌మ‌యంలో క‌న్నా తీసుకున్న అమ‌రావ‌తి స్టాండు స‌హా.. చంద్ర‌బాబు అనుకూర‌ల‌నే అంశాల‌ను వీరు తీవ్రంగా వ్య‌తిరేకించారు. ఫ‌లితంగా క‌న్నాకు మ‌ద్ద‌తు క‌రువైంది. ఇది పార్టీలో ఆయ‌న ప‌ద‌వికి ఎస‌రు పెట్టింద‌నే వాద‌న కూడా ఉంది. ఈ ప‌రిణామాల‌ను అంచ‌నా వేసుకున్న సోము.. కంభంపాటి రామ్మోహ‌న్‌రావు, కామినేని శ్రీనివాస్‌, పురందేశ్వ‌రి వంటి నాయ‌కుల‌కు పార్టీ క‌మిటీలో చోటు పెట్ట‌లేదు.

అంతేకాదు, రెడ్డి సామాజిక వర్గానికి సోము ప్రాధాన్యం ఇచ్చారు. ఇక‌, ఆర్ ఎస్ ఎస్ మూలాలున్న మాధ‌వ్ వంటి వారికి ప్రాధాన్యం పెంచారు. ఈ ప‌రిణామం.. సోముకు మ‌ద్ద‌తు పెంచేదేన‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. అదేస‌మ‌యంలో క‌న్నా వంటి ఏక‌ప‌క్ష నేత‌ల శ‌కానికి ముగింపు ప‌లికిన‌ట్టేన‌ని చెబుతున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితి రేపు ఎన్నిక‌ల నాటికి ఉండ‌క‌పోయినా.. అనివార్య ప‌రిస్థితిలో బీజేపీ ఒంట‌రి పోరుకు సిద్ధ‌మైనా త‌ట్టుకుని నిల‌బ‌డ‌గ‌లిగేలా ..సోము కెమిస్ట్రీ ఉంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఏమేర‌కు ఆయ‌న కెమిస్ట్రీ నిల‌బ‌డుతుందో.. వ్యూహం ఫ‌లిస్తుందో చూడాలి.