కాంగ్రెస్‌ను లైట్ తీసుకుంటే క‌ష్ట‌మే!

ఏపీలో కూట‌మి పార్టీల‌కు కొత్త చిక్కు వ‌చ్చింది. వైసీపీని గ‌ద్దె నుంచి దించాల‌న్న ల‌క్ష్యంతో జ‌న‌సేన‌-టీడీపీ-బీజేపీలు జ‌త‌క‌ట్టాయి. ఓటు బ్యాంకు చీల‌కుండా చూడాల‌ని నిర్ణ‌యించాయి. ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా.. అసంతృప్త జ్వాల‌లు ఎగిసి ప‌డినా.. కూట‌మిగానే ముందుకు సాగుతున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా.. లైన్‌లో ఉంది. ఏముందిలే.. అని ఈ పార్టీని లైట్ తీసుకుంటున్నారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన టికెట్లు, నిల‌బెట్టిన నాయ‌కుల‌ను గ‌మ‌నిస్తే.. లైట్ తీసుకునే అవ‌కాశం లేదు.

రాష్ట్ర వ్యాప్తంగా కాక‌పోయినా.. దాదాపు 50 నుంచి 70 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీక‌న్నా వ్య‌క్తుల బ‌ల‌మే ఎక్కువ‌గా ఉంది. వీరిప‌ట్ల ప్ర‌జ‌ల‌కు ఉన్న సానుభూతి.. ఇక్క‌డ ప్ర‌భావితం చూపించే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఉదాహ‌ర‌ణ‌కు తిరువూరు నియోజ‌క‌వ‌ర్గంలో(ఎస్సీ) తాంతియా కుమారి కాంగ్రెస్‌ త‌ర‌ఫున పోటీచేస్తున్నారు. ఈమెకు బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంది. ఈమె తండ్రి మాజీ మంత్రి కోనేరు రంగారావు.. సానుభూతి ఆమెకు గెలిచేంత కాక‌పోయినా.. క‌నీసం 30 వేల వ‌ర‌కు ఓట్ల‌ను వేయిస్తుంది.

అదేవిధంగా శింగ‌న‌మ‌ల ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ మంత్రి సాకే శైల‌జానాథ్ బ‌రిలో ఉన్నారు. ఈయనకు కూడా సానుభూతి ఉంది. పార్టీ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. సాకేకు సొంత‌గా ఇక్క‌డ ఓటు బ్యాంకు ఉంది.. ఇది కూడా.. 25-35 వేల ఓట్ల‌ను ప్ర‌భావితం చేస్తుంది. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా మాజీ మంత్రి కిల్లి కృపారాణి రంగంలో ఉన్నారు. క‌ళింగ సామాజిక వ‌ర్గం ఓట్లు చీల్చ‌డంలో ఈమెను మించిన వారు లేర‌నే టాక్ అంద‌రికీ తెలిసిందే.

ఇది.. కూట‌మి అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న అచ్చెన్నాయుడిపై ప్ర‌భావం చూపించ‌నుంది. ఇక‌, విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌లో కాంగ్రెస్ -వామ‌ప‌క్షాల పొత్తులోభాగంగా సీపీఎం నాయ‌కుడు చిగురుపాటి బాబూరావు బ‌రిలో ఉన్నారు. ఈయ‌న గ‌త ఎన్నిక‌ల్లోనే 25 వేల ఓట్లు చీల్చి.. టీడీపీ అభ్య‌ర్థి ప‌రాజ‌యానికి ప‌రోక్షంగా కార‌ణ‌మ‌య్యారు. ఇప్పుడు మ‌రో 30 వేల వ‌ర‌కు ఈయ‌న ఓటు బ్యాంకు పెంచుకున్నారు. ఇది కూడా.. కూట‌మికి ఎఫెక్టే.

అదేవిధంగా బాప‌ట్ల ఎంపీగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు.. జేడీ శీలం, కాకినాడ ఎంపీగా బ‌రిలో ఉన్న ప‌ల్లంరాజు వంటివారు.. కూడా కూట‌మి ఓట్ల‌ను ప్ర‌భావితం చేయ‌డంలో ముందున్నార‌నేది అంద‌రికీ తెలిసిందే. వీరికి ఉన్న చ‌రిష్మా.. స్థానికంగా ఉన్న ఓటు బ్యాంకు వంటివి.. వీరి గెలుపున‌కు దోహ‌ద‌ప‌డ‌క‌పోయినా.. ఓట్ల‌ను చీల్చ‌డంలో మాత్రం.. ఖ‌చ్చితంగా ప్ర‌భావం చూపిస్తుంది. అదికూట‌మికే ఎఫెక్ట్ అవుతుంద‌నేది ప‌రిశీల‌కులు చెబుతున్న మాట‌.