క‌విత‌ను మ‌ర్చిపోయిన కేసీఆర్‌.. ఎందుక‌లా?

క‌ల్వ‌కుంట్ల క‌విత‌.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో అరెస్ట‌యిన ఆమె ప్ర‌స్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. కానీ కేసీఆర్ మాత్రం త‌న కూతురును పూర్తిగా మ‌ర్చిపోయారా? ఆమె గురించి కానీ అరెస్టు గురించి కానీ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడ‌టం లేద‌నే? ప్ర‌శ్న‌లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. మొన్న‌టివ‌ర‌కంటే తుంటి ఎముక మార్పిడి ఆప‌రేష‌న్ నుంచి కోలుకోవడం కోసం కేసీఆర్ జ‌నాల్లోకి రాలేదు. కానీ ఇప్పుడు పొలం బాట పేరుతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. పంట‌ల‌ను ప‌రిశీలిస్తున్నారు. రైతుల‌తో మాట్లాడుతున్నారు. ఆ త‌ర్వాత విలేక‌ర్ల స‌మావేశం పెట్టి కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కానీ క‌విత గురించి మాత్రం ఎక్క‌డా ప్ర‌స్తావించ‌డం లేదు.

క‌విత‌ను ఈడీ అక్ర‌మంగా అరెస్టు చేసింద‌ని, ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌తో ఆమెకు సంబంధం లేద‌ని మాత్రం చెప్పే ప్ర‌య‌త్నం కేసీఆర్ చేయ‌డం లేదు.  క‌విత అరెస్ట‌యి 20 రోజులు అయిపోయింది. మార్చి 15న ఈడీ అధికారులు హైద‌రాబాద్‌లో ఆమెను అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు. అప్పుడు కేటీఆర్‌, హ‌రీష్ రావు హడావుడి చేశారు. ఢిల్లీకి కూడా వెళ్లారు. ప్ర‌స్తుతం తీహార్ జైల్లో ఉన్న క‌విత‌.. రాజ‌కీయ క‌క్ష సాధింపు చ‌ర్య‌లో భాగంగానే త‌న‌ను అరెస్టు చేశార‌ని చెబుతున్నారు. కానీ ఆయ‌న తండ్రి కేసీఆర్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడ‌క‌పోవ‌డం ఇప్ప‌టికీ ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తూనే ఉంద‌ని చెప్పాలి.

ఏదైనా ప‌రిణామం జ‌రిగితే వెంట‌నే స్పందించే కేసీఆర్‌.. సొంత కూతురు అరెస్టును ఎందుకు ఖండించ‌డం లేద‌నే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. స్వ‌యంగా బీఆర్ఎస్ నేత‌లే ఈ విష‌యంలో అధినేత వైఖ‌రిని త‌ప్పుప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. క‌విత త‌ప్పు చేశారు కాబ‌ట్టే కేసీఆర్ రియాక్ట్ కావ‌డం లేద‌నే అభిప్రాయం ప్ర‌జ‌ల్లోకి వెళ్తుంద‌ని పార్టీ నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. కేసీఆర్ వెంట‌నే క‌విత అరెస్టును ఖండించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు. ఈ అరెస్టు కార‌ణంగా ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లో పార్టీపై చెడు అభిప్రాయం కార‌ణంగా నేత‌లు కారు దిగుతున్నార‌నే చెప్పాలి. మ‌రోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండ‌టంతో బీజేపీతో స‌త్సంబంధాల కోస‌మే కేసీఆర్ సైలెంట్‌గా ఉన్నార‌నే టాక్ కూడా వినిపిస్తోంది.