జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను టీడీపీకి దూరం చేసేది ఆ ఇద్ద‌రేనా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ మ‌రోసారి రాజ‌కీయంగా తెర‌మీదికి వ‌చ్చిన పేరు. టీడీపీ విషయంలో సానుకూలంగా స్పందించి.. 2009 ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. ఆ స‌మ‌యంలో యాక్సిడెంట్ జ‌రిగినా.. కూడా ఆసుప‌త్రి నుంచి ప్ర‌చారం నిర్వ‌హించారు. అయితే, ఆ త‌ర్వాత కాలంలో ఆయ‌న టీడీపీకి దూరంగా ఉంటున్నారు. దీనిపై అనేక కార‌ణాలు ఉన్నాయి. అయితే.. తాజాగా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ మ‌రికొన్ని సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు.

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. టీడీపీకి దూరంగా లేర‌న్న ఆయ‌న ప్ర‌స్తుతం త‌న వృత్తి(సినిమా రంగం)లో ఉన్నారని.. సీనియ‌ర్ ఎన్టీఆర్ మాదిరిగా ఆయ‌న కూడా యువ‌కుడిగా ఉన్న నేప‌థ్యంలో సినిమాల‌పైనే ఎక్కువ‌గా దృష్టి పెడుతున్నార‌ని తెలిపారు. అయితే.. టీడీపీకి దూరంగా ఉంచాల‌నేది ఓ ఇద్ద‌రు నాయ‌కులు ప‌న్నిన కుట్ర‌గా చింత‌మ‌నేని వ్యాఖ్యానించారు. టీడీపీకి దూరంగా ఉన్నాడ‌ని.. టీడీపీ అన్యాయం చేసింద‌ని ఆ ఇద్ద‌రు నాయ‌కులు జూనియ‌ర్ ఎన్టీఆర్ విష‌యంలో ప‌దే ప‌దే మొస‌లి క‌న్నీరు కారుస్తున్నార‌ని చెప్పారు.

అయితే.. వాస్త‌వానికి ఆ ఇద్ద‌రే జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను మోసం చేశార‌ని చింత‌మ‌నేని తెలిపారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీలు.. జూనియ‌ర్ ఎన్టీఆర్ నుంచి డ‌బ్బులు తీసుకుని మోసం చేశార‌ని వ్యాఖ్యానించారు. ‘అదుర్స్’ సినిమాకు ఈ ఇద్ద‌రు నేత‌లు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రించార‌ని.. ఆ సమయంలో హైద‌రాబాద్ శివారులోని కోకాపేటలో భూమి కొనడానికి జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి 8 కోట్ల రూపాయ‌లు తీసుకున్న‌ట్టు వెల్ల‌డించారు. అయితే.. భూములు కొన‌కుండా.. డ‌బ్బులు కూడా వెన‌క్కి ఇవ్వ‌కుండా ప‌చ్చి మోసం చేశార‌ని పేర్కొన్నారు.

అందుకే.. జూనియ‌ర్ కూడా వీళ్ల‌ని వ‌దిలేశార‌ని.. దీంతో వీళ్ల‌కు టీడీపీలో విలువ లేకుండా పోయింద‌ని.. ఇక్క‌డ ఉంటే కొడ‌తార‌న్న కార‌ణంగానే.. నాని, వంశీలు పార్టీలు మారి వైసీపీలోకి వెళ్లిపోయార‌ని చింత‌మ నేని చెప్పారు. అంతేకాదు.. త‌ర‌చుగా.. జూనియ‌ర్ గురించి మాట్లాడుతూ.. ఆయ‌న‌కు చంద్ర‌బాబు వెన్ను పోటు పోడిచారని, వాడుకుని వ‌దిలేశార‌ని.. ఆయ‌న‌కు టీడీపీలో విలువ లేద‌ని.. చెబుతూ.. గ‌న్న‌వ‌రం, గుడివాడ ఎమ్మెల్యే లు.. చేసే విమ‌ర్శ‌లు జూనియ‌ర్‌ను టీడీపీకి దూరంగా ఉంచాల‌నే ఉద్దేశంతో చేస్తున్న‌వేన‌ని పేర్కొన్నారు. అయితే.. జూనియ‌ర్ ర‌క్తంలోనే టీడీపీ ఉంద‌ని పేర్కొన్నారు. 2009లో టీడీపీ కోసం ఆయ‌న ప్ర‌చారం చేశార‌ని.. యాక్సిడెంట్ అయిన‌ప్ప‌టికీ… పార్టీ కోసం ప్ర‌చారం వ‌ద‌ల‌లేద‌న్నారు.

“జూనియర్ ఎన్టీఆర్, తెలుగుదేశం వేరు కాదు. ఎన్టీఆర్ 2012లోనే ఈ విష‌యం చెప్పాడు. నా కట్టే కాలేవ రకు, నాలో ప్రాణం ఉండే వరకు తెలుగుదేశంతోనే ఉంటానన్నాడు. ఎన్టీఆర్ తన సినిమాల మీద దృష్టి పెట్టాడు. తాత గారిలాగా పేరు తెచ్చుకున్నాడు. రావాల్సిన సమయం వచ్చినప్పుడు పార్టీలోకి వస్తాడు. వచ్చినప్పుడు తన స్థానం ఏంటో ఆయ‌న చ‌ర్చించి తీసుకుంటారు” అని చింత‌మ‌నేని వ్యాఖ్యానించారు. సో.. చింత‌మ‌నేని వెల్ల‌డించిన విష‌యాల‌ను బ‌ట్టి.. టీడీపీకి జూనియ‌ర్‌ను దూరం చేస్తోంది.. నాని, వంశీలేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.