మంత్రి ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ సీటుపై క‌న్నేసిన‌ వైసీపీ టాప్ లీడ‌ర్‌..?

మంత్రి విడుదల రజ‌నీ ఇప్పుడు అధికార వైసీపీ వాళ్లకే టార్గెట్గా మారిపోయారు. చాలా తక్కువ టైంలోనే ఎమ్మెల్యే అవడంతో పాటు.. మంత్రి అయ్యి ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాలలో కీలక నేతగా ఎదిగిపోయారు రజ‌ని. ఇంకా చెప్పాలంటే సీఎం జగన్ తో పాటు ప్రభుత్వ పెద్దలు కూడా రజ‌నీని బాగా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. దీంతో గత రెండేళ్ల పాటు రజ‌ని హవా మామూలుగా లేదని చెప్పాలి. ఇక జిల్లాలోనూ ఆమె చెప్పిందే వేదం అన్నట్టుగా సాగింది. 2019 ఎన్నికలకు ముందు చిలకలూరిపేట నుంచి పోటీ చేసి టీడీపీ సీనియర్ నేత.. అప్పటి మంత్రి ప్రతిపాట్టి పుల్లారావు పై సంచలన విజయం సాధించారు రజినీ.

ఇక రెండేళ్ల క్రితం జగన్ క్యాబినెట్‌లో అనూహ్యంగా మంత్రి పదవి కూడా కొట్టేశారు. అయితే తాజా ఎన్నికలకు ముందు జగన్ తో పాటు పలు సర్వేలలో రజనీకి చిలకలూరిపేటలో వ్యతిరేకంగా నివేదికలు వచ్చాయి. ఆమె ఈసారి చిలకలూరిపేటలో చిత్తుచిత్తుగా.. ఘోరంగా ఓడిపోతుందని క్లారిటీ వచ్చేయడంతో.. జగన్ ఆమెను గుంటూరు వెస్ట్‌కు ట్రాన్స్ఫర్ చేశారు. గుంటూరు వెస్ట్ లో దిగడంతోనే రజ‌ని చాలా దూకుడు రాజకీయం మొదలుపెట్టేశారు. గుంటూరు నగరంలో ఉన్న వైసీపీ సీనియర్ నేతలు అందరిని సైడ్‌ చేసేసి ఆమె తనకంటూ ఒక పంథా ఏర్పాటు చేసుకొని ముందుకు వెళుతున్నారు.

రజ‌ని సీనియర్ నేతలను కలుపుకోకుండా ఏకపక్షంగా ముందుకు వెళుతుండడంతో నగరంలోనే కాకుండా.. జిల్లాలో ఉన్న వైసీపీ నేతలు కూడా ఆమె తీరు పట్ల అసంతృప్తితో ఉన్నారు. పైకి ఎవరు చెప్పుకోలేకపోతున్నారు కానీ.. లోపల మాత్రం రజ‌నీని.. అద‌ను చూసి దెబ్బ కొట్టాలని చూసేవాళ్లే వైసీపీలో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆమె పోటీకి రెడీ అవుతున్న గుంటూరు వెస్ట్ సీటుపై.. గుంటూరు వైసీపీ పార్లమెంటు సమన్వయకర్తగా వచ్చిన పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య ఆశపడుతున్నట్టు తెలుస్తోంది.

బదిలీల్లో భాగంగా జగన్.. రోశయ్యను పొన్నూరు నుంచి గుంటూరు పార్లమెంటుకు బదిలీ చేశారు. పొన్నూరు సీటును మంత్రి అంబటి రాంబాబు తనయుడు అంబటి మురళికి కేటాయించారు. అయితే రోశ‌య్య తాను గుంటూరు పార్లమెంటుకు పోటీ చేయలేనని.. అంత ఆర్థిక స్తోమత తనకు లేదని.. తనకు పొన్నూరు సీటే కేటాయించాలని.. తన మామ ఉమారెడ్డి వెంకటేశ్వర్లుతో కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర మొరపెట్టుకున్నట్టు తెలుస్తోంది. పొన్నూరు సీటు ఇవ్వకపోతే రజనీ పోటీ చేస్తున్న గుంటూరు వెస్ట్ సీటు అయినా తనకు ఇవ్వాలని.. లేనిపక్షంలో తాను పోటీ చేయన‌ని తేల్చి చెప్పినట్టు గుంటూరు నగరంలో గత కొద్దిగంటలుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలోనే రోశయ్య తాను వెస్ట్ నుంచి పోటీ చేస్తే.. రజనీని గుంటూరు పార్లమెంటుకు పోటీ చేయించాలని కూడా ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై సజ్జల ఇప్పటికిప్పుడు.. ఇలాంటి మార్పులు జరిగే పని కాదని.. ఎవరు పని వారు చేసుకోవాలని సున్నితంగా చెప్పి రోశయ్యను వెనక్కి పంపినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా వైసీపీలో చాలా సీట్లలో బీఫాంలో ఇచ్చేవరకు ఏ సీటు నుంచి ఎవరు పోటీ చేస్తారో.. ఏ సీటు ఎవరికి దక్కుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.