జ‌న‌సేన‌కు గ్లాసు గుర్తే.. బెంగ‌లేదు.. కానీ, స‌స్పెన్స్‌!

ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో ఎన్నిక‌ల గుర్తుల అంశం జ‌న‌సేన పార్టీని కుదిపేస్తోంది. ఈ పార్టీకి.. గాజు గ్లాసు గుర్తు ఉన్న విష‌యం తెలిసిందే. అయితే.. గుర్తింపు పొందిన పార్టీ కాక‌పోవ‌డంతో ప్ర‌తిసారీ గుర్తు విష‌యంలో ఇబ్బందులు ఎదుర‌వుతున్నారు. గ‌త ఏడాది జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ గుర్తు విష‌యంలో జ‌న‌సేన ఇబ్బందులు ఎదుర్కొంది. ఇప్పడు ఏపీలోనూ ఇదే ఇబ్బంది ఎదురైంది. అయితే.. తాజాగా ఈ కేసు ఏపీ హైకోర్టుకు చేసింది. దీనిలో వాద‌న‌లు విన్న‌వారికి .. జ‌న‌సేన‌కు గ్లాసు గుర్తు క‌న్ఫ‌ర్మేన‌నిచెబుతున్నారు. అయితే.. కోర్టు తీర్పును మాత్రం రిజ‌ర్వ్ చేసింది.

వాద‌న‌లు ఇవీ..

జ‌న‌సేన‌కు ఉన్న గాజు గ్లాసు గుర్తును త‌మ‌కు కేటాయించాల‌ని రాష్ట్రీయ ప్ర‌జా కాంగ్రెస్‌(ఆర్ పీసీ) కేంద్ర ఎన్నికల‌సంఘాన్ని కోరింది. అయితే.. ముందుగా వ‌చ్చిన వారికి ముందుగానే గుర్తును కేటాయిస్తామ‌న్న కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. దీనిని జ‌న‌సేన‌కు కేటాయిస్తున్న‌ట్టు పేర్కొంది. దీనిపై ఆర్ పీసీ.. హైకోర్టును ఆశ్ర‌యించింది. ఈ క్ర‌మంలో పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఎంవీ రాజారామ్‌ వాదనలు వినిపించారు. ఈసీ నిబంధనలకు విరుద్ధంగా జనసేనకు గాజుగ్లాసు గుర్తు కేటాయించిందన్నారు.

జనసేన తరఫున సీనియర్‌ న్యాయవాది వేణుగోపాలరావు వాదనలు వినిపిస్తూ.. నిబంధనల ప్రకారమే గుర్తు కేటాయింపు జరిగిందన్నారు. ఈసీ తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌, న్యాయవాది శివదర్శిన్‌ వాదనలు వినిపిస్తూ.. ‘జనసేన’ ముందుగా దరఖాస్తు చేసుకుందని తెలిపారు. అసెంబ్లీ కాలపరిమితి ముగియడానికి ఆరు నెలల ముందు ఫ్రీ సింబల్‌ గుర్తుల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.

ఇలా చూస్తే.. గత డిసెంబరు 12న తాము దరఖాస్తుల ఆహ్వానాన్ని ప్రారంభించగా అదేరోజు జనసేన దరఖాస్తు చేసిందన్నారు. పిటిషనర్‌ పార్టీ (రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌) డిసెంబరు 20న దరఖాస్తు చేయగా అది 26న అందిందన్నారు. దీనిని బ‌ట్టి గుర్తు జ‌న‌సేన‌కే వ‌స్తుంద‌న్న‌ది ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. అయితే.. కోర్టు మాత్రం తీర్పును రిజ‌ర్వ్ చేసింది. దీనిపై త్వ‌ర‌లోనే నిర్ణ‌యం వెలువ‌రించ‌నుంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఏదేమైనా.. క‌నీసం 15 శాతం ఓట్లు, 15 శాతం మంది అభ్య‌ర్థుల‌ను గెలిపించుకుంటే త‌ప్ప‌.. జ‌న‌సేన‌కు గాజు గ్లాస్ గుర్తు… ప‌ర్మినెంట్‌గా ద‌క్కే అవ‌కాశం లేదు.