ఈ రోజుతో మన్మోహన్ సింగ్ సుదీర్ఘ ప్రస్థానానికి తెర

Manmohan Singh

రాజకీయాలు మహా సిత్రంగా ఉంటాయి. అనుకోని రీతిలోఅందలం ఎక్కే అవకాశం కొందరికిమాత్రమే దక్కుతుంది. ప్రతిభ ఉన్నప్పటికీ కొన్నిసార్లు కాలం కలిసి రాదు. మరికొన్నిసార్లు మాత్రం అందుకు భిన్నంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకొని అంచనాలకు భిన్నంగా అత్యుత్తమ స్థానాలకు చేరుకోవటం కనిపిస్తుంది.

ఆ కోవలోకే వస్తారు మౌన మునిగా పేరున్న మేధావి కం రాజకీయ నేత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. దేశ ప్రధానమంత్రిగా పదేళ్లు వ్యవహరించిన ఆయనపై ఆయన ప్రత్యర్థులు సైతం ఒక్క అవినీతి మరకను ఆయనకు అంటించేందుకు సాహసించని అరుదైన వ్యక్తిత్వం ఆయన సొంతం.

33 ఏళ్లుగా సాగుతున్న ఆయన పొలిటికల్ కెరీర్ ఈరోజుతో ముగింపునకు వచ్చినట్లేనని చెప్పాలి. పార్లమెంటు సభ్యుడిగా మూడు దశాబ్దాలకు పైనే సాగిన ఆయన ప్రయాణానికి ఈ రోజే ఆఖరురోజు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఈ రోజు (ఏప్రిల్ 3) పదవీ విరమణ చేయనున్నారు. ఇప్పుడున్న పరిస్థితులు.. రాబోయే రోజుల్లో ఆయన తిరిగి రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యే అవకాశం లేదనే చెప్పాలి. పెరిగిన వయోభారంతో పాటు.. కాంగ్రెస్ పరిస్థితి అంతకంతకూ మసకబారుతున్న వేళ.. ఆయన పొలిటికల్ ప్రయాణానికి బ్రేకులు పడినట్లేనని చెప్పాలి.

దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్ మిగిలిపోతారు. 1991 అక్టోబరులో తొలిసారి రాజ్యసభలోకి అడుగుపెట్టిన ఆయన పీవీ సర్కారులో ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు. అనంతరం 2004 నుంచి 2014 వరకు దేశ ప్రధానిగా సేవలు అందించారు. దేశాన్ని సుదీర్ఘంగా పాలించిన ప్రధానమంత్రుల్లో ఆయన ఒకరు. పొత్తుల్లో భాగంగా సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహించిన ఆయన కూటమి ఛైర్ పర్సన్ సోనియా చేతిలో రిమోట్ గా మారారన్న అపప్రధను మూటకట్టుకున్నా.. తనకున్న పరిమితుల్లోనే ఆయన దేశాన్ని ముందుకు నడిపించారనిమాత్రం చెప్పక తప్పదు.

91 ఏళ్ల వయసున్న మన్మోమన్ సింగ్ ను చాలామంది మౌన మునిగా విమర్శిస్తుంటారు. ఈ సందర్భంలోనూ ఆయన నోరు విప్పి మాట్లాడింది లేదు. తన భావాల్ని.. తన అభిప్రాయాల్ని సూటిగా చెప్పింది లేదు. అయితే.. ఒక విషయంలో మాత్రం ఆయన్ను అభినందించాల్సిందే. ఆయన మాట్లాడకపోవచ్చు. కానీ.. చేతల్లోకి వచ్చేసరికి మాత్రం కఠినంగా వ్యవహరించారనే చెప్పాలి. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా భారీ నిర్ణయాలు తీసుకోవాల్సిన వేళలో వెనుకంజ వేసింది లేదు. ఏప్రిల్ 2, 3 తేదీల్లో రాజ్యసభ నుంచి 54 మంది సభ్యుల పదవీ కాలం ముగిసింది.

వీరిలో కొందరు సభలోకి తిరిగి అడుగు పెడుతుంటే.. మరికొందరు మాత్రం నిష్క్రమిస్తున్నారు. మన్మోహన్ నిష్క్రమణ జాబితాలో ఉన్నారు. ఆయన స్థానంలో రాజ్యసభకు తొలిసారిగా ఎంపికయ్యారు కాంగ్రెస్ ముఖ్యనేత సోనియాగాంధీ. బాధ కలిగించే అంశం ఏమంటే.. పదేళ్లు దేశ ప్రధానిగా వ్యవహరించిన మన్మోహన్.. చట్టసభల నుంచి నిష్క్రమించే రోజు అత్యంత పేలవంగా సాగటమే. కొన్నిసార్లు ఆరంభం బాగుంది.. ప్రయాణం మధ్యలో మెరుపులు మెరిపించినా.. నిష్క్రమణ మాత్రం పేలవంగా సాగుతుంది. మన్మోహన్ విషయంలో ఇది నిజమైందని చెప్పాలి.