మ‌నిషి వైసీపీలో – మ‌న‌సు కూట‌మిలో..!

రాష్ట్రంలోని ఒక్కొక్క‌ నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ.. ఆ పార్టీల నాయకులు వ్యవహరిస్తున్న తీరు ఏ విధంగా ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షం కాకపోయినా ప్రతిపక్షంగా అయినా ఉన్న వైసీపీలో నాయకులు వ్యవహరిస్తున్న తీరు చిత్రంగా ఉంటుంది. ఉదాహరణకు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గం పరిస్థితిని తీస్తే ఇక్కడ గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన విరూపాక్షి విజయం దక్కించుకున్నారు.

వాస్తవానికి గత మూడు ఎన్నికల్లో కూడా వైసిపి ఇక్కడ విజయం సాధిస్తూ వచ్చింది. 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుస విషయాలు దక్కించుకుంది. గత ఎన్నికల్లో విరూపాక్షి విజయం సాధించినా గత కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అదే సమయంలో కూటమి నాయకులతో కలిసి మెలిసి తిరుగుతున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం నియోజకవర్గంలో పనులు జరగాలంటే తాను ఒంటరిగా సాధించలేని పరిస్థితిలో ఉన్నానని ఇటీవల పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో విరూపాక్షి బయటపెట్టారు.

అయితే ఆయన కూటమిలో ఉన్న నాయకులతో కలిసిమెలిసి తిరుగుతున్నారన్న వాదన పార్టీలో బహిరంగంగానే వినిపిస్తోంది. నిజానికి ఎవరైనా కేసులు ఉన్నవాళ్లు, లేకపోతే తమ మీద తీవ్ర స్థాయిలో అభియోగాలు ఉన్న నాయకులు మాత్రమే అటు ఇటుగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గతంలో కూడా ఇలా జరిగిన సంఘటనలు ఉన్నాయి. కానీ, విరూపాక్ష విషయంలో మాత్రం దీనికి భిన్నంగా కూటమి నాయకులతో ఆయన కలివిడిగా ఉండటం అంతర్గతంగా చర్చలు జరుగుతుండడంతో పాటు నియోజకవర్గంలో పనుల కోసం ఇవన్నీ చేస్తున్నానని చెబుతుండడం మరింత చిత్రంగా ఉంది.

ఇక ఈ విషయంలో పార్టీ అధిష్టానం పట్టినట్టుగా వ్యవహరిస్తోంది. ఏం జరిగినా పర్వాలేదులే అన్నట్టుగా ఉండటం కూడా ఒక రకంగా విరూపాక్షకి కలిసి వస్తున్న అంశంగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం.. ఆలేరు నియోజకవర్గం కూడా మనదే అంటూ వ్యాఖ్యానించటం విరూపాక్షి అంతర్గతంగా చేస్తున్న రాజకీయాలకు ఉదాహరణగా మారిందన్న చర్చ నడుస్తోంది.