అమెరికాలో లోకేష్ ను ఆపిన పోలీసులు…

తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు. డల్లాస్ తెలుగు డయాస్పోరా సమావేశానికి విచ్చేసిన ఆయనకు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేదికపై లోకేష్ ఒక ఆసక్తికరమైన సంఘటనను గుర్తు చేసుకున్నారు. అమెరికాలో సుమారు తొమ్మిదేళ్లు ఉన్నాను. కానీ ఎప్పుడూ జరగని సంఘటన ఈ రోజు జరిగిందంటూ ఆయన వివరించారు.

నేను అమెరికాలో చదివాను. నాలుగు సంవత్సరాలు ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశాను. రెండు సంవత్సరాలు ఇక్కడ వాషింగ్టన్ డిసి లో వరల్డ్ బ్యాంకులో పని చేశాను. మరో రెండు సంవత్సరాలు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశాను అని గుర్తు చేశారు. ఈ దేశంలో ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్న ఇప్పుడు జరగని సంఘటన ఈ రోజు జరిగిందన్నారు.

తాను ఎయిర్పోర్టులో దిగి బయటకు వస్తున్నప్పుడు ఆరుగురు పోలీసులు వచ్చి తనను ఆపారని అన్నారు. నన్ను పట్టుకెళ్ళడానికి వచ్చారా లేక బయటికి తీసుకెళ్లడానికి వచ్చారా అని అనుమానం వేసింది అన్నారు. ఇక్కడ ఆగండి అని వారు సూచించారు. ఏమైందని అడగ్గా బయట చాలా రద్దీగా ఉంది, ఇక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు పర్మిషన్ లేదు అని అన్నారని తెలిపారు. అందుకే వేరే మార్గం నుండి నన్ను బయటకు తీసుకొని వచ్చారు అని లోకేష్ తెలిపారు. డల్లాస్ లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి ఈ కార్యక్రమం వరకు తనకు ఘన స్వాగతం పలికారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

లోకేష్ అమెరికా గడ్డపై అడుగు పెట్టినప్పటి నుంచి ఆయనకు అడుగడుగునా తెలుగు ప్రజలు హారతి పడుతున్నారు. వెళ్లిన ప్రతిచోట లోకేష్ ను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆయనతో కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు. మంత్రి నారా లోకేష్ రాకతో డల్లాస్ డయాస్పోరా ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. టీడీపీ, బీజేపీ, జనసేన జెండాలు అక్కడ రెపరెపలాడాయి. వారి జోష్, ఉత్సాహం చూస్తుంటే తన యువగళం పాదయాత్ర రోజులు గుర్తొచ్చాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. వేలాదిమంది తెలుగువారితో ఒక్కసారిగా డయాస్పోరా ప్రాంగణం నిండిపోయింది ఎన్నారైల ఆత్మీయ స్వాగతం, సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఎన్నారైలు ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ ఉత్తేజ భరితంగా ప్రసంగించారు.