ఇంత డ‌బ్బున్నా.. ర‌ఘురామ‌కు టికెట్ లేదా?!

“నా ద‌గ్గ‌ర ఎన్నిక‌ల్లో పోటీచేసేంత డ‌బ్బులేదు. అందుకే ఎన్నిక‌ల‌కు దూరంగా దూరంగా ఉంటున్నా”- ఇదీ.. కేంద్ర మంత్రి, బీజేపీ నాయ‌కురాలు నిర్మ‌లా సీతారామ‌న్ చెప్పిన మాట‌. అంటే.. టికెట్ ఇవ్వ‌డానికి డ‌బ్బు కూడా ఒక కొల‌మానం అని ఆమె చెప్ప‌క‌నే చెప్పారు క‌దా! మ‌రి ఈ విస‌యంలో రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఏం పాపం చేశారు? ఆయ‌న ద‌గ్గర డ‌బ్బుకు కొద‌వ లేద‌ని.. ఆయ‌న స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ల‌లోనే(2019) స్ప‌ష్టంగా ఉందిక‌దా! ఇదే విష‌యాన్ని తాజాగా ఏడీఆర్ నివేదిక కూడా స్ప‌ష్టం చేసింది క‌దా! మ‌రి ఇంత డ‌బ్బున్నా ర‌ఘురామ‌కు టికెట్ ఎందుకు ఇవ్వ‌లేదు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

న‌ర‌సాపురం పార్ల‌మెంటు స‌భ్యుడు.. వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుకు టికెట్ రాలేద‌ని ఆయ‌న‌, ఆయ‌న‌తోపాటు ఆయ‌న అభిమానులు కూడా తెగ ఫీల‌వుతున్నారు. నిజ‌మే. టికెట్ వ‌స్తుందని ఆశ‌లు పెట్టుకు న్నాక‌.. రాక‌పోతే ఇబ్బందే క‌దా! పైగా సీఎం జ‌గ‌న్‌పై కారాలు మిరియాలు నూర‌డ‌డ‌మే కాదు.. ఏకంగా కేసులు కూడా పెట్టారు. మ‌రింత‌గా సీఎం జ‌గ‌న్‌పై పోరాటం చేసిన ఆయ‌నకు టికెట్ ఇంకా క‌న్ఫ‌ర్మ్ కాలేదు. దీంతో ర‌ఘురామ అభిమానులు మాన‌సికంగా కూడా ఇబ్బంది ప‌డుతున్నారు.

ఇలాంటి స‌మ‌యంలో టికెట్ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. మ‌రో సంచ‌ల‌న వార్త తెర‌మీదికి వ‌చ్చింది. అది కూడా ర‌ఘురామ గురించే కావ‌డం గ‌మ‌నార్హం. దేశంలోని అత్యంత ధ‌న‌వంతులైన ఎంపీల్లో ర‌ఘురామ కూడా ఒక‌ర‌ని ఏడీఆర్ నివేదిక స్ప‌ష్టం చేసింది. దేశ‌వ్యాప్తంగా ముగ్గురు ఎంపీల ఆస్తులు.. రూ.1000 కోట్ల‌కు పైగా ఆస్తులు ఉన్నాయ‌ని.. వీరిలో తొలి రెండు స్థానాల్లో కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. మూడో స్తానంలో ర‌ఘురామ ఉన్నార‌ని లెక్క‌ల‌తోస‌హా ఏడీఆర్ నివేదిక వెల్ల‌డించింది. మ‌రి ఇలాంటి నాయ‌కుడికి బీజేపీ మొండి చేయి చూపించ‌డం ఏంటి? అనేది ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌. మ‌రి దీనివెనుక ర‌ఘురామ చెబుతున్న‌ట్టుగా సీఎం జ‌గ‌న్ ఒత్తిడి ఉందా? లేక‌.. ఇంకేదైనా కార‌ణ‌మా? అనేది చూడాలి.

ఇదిలావుంటే, దేశంలో ఎంపీలుగా ఉన్న‌వారిపై క్రిమినల్ కేసులు ఉన్న విష‌యాన్ని కూడా ఏడీఆర్ ప్ర‌స్తావించింది. లోక్‌సభలోని 514 మంది ఎంపీల్లో 225(44%) మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్టు స్పష్టమైంది. వారు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లను అధ్యయనం చేసిన అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) ఈ వివరాలను వెల్లడించింది. ఇక, వీరిలో 5 శాతం మంది ఎంపీలు రూ.100 కోట్లకు పైబడి ఆస్తులు కలిగినట్టు తెలిపింది.

  • 29 శాతం మంది సభ్యులపై అతి తీవ్రమైన క్రిమినల్‌ కేసుఉన్నాయి. వీటిలో హత్య, హత్యా ప్రయత్నం, మతపరమైన హింసను ప్రేరేపించడం, కిడ్నాపులు, మహిళలపై దాడులు, లైంగిక నేరాలు ఉన్నాయి. 9 మంది ఎంపీలపై హత్య కేసులు నమోదయ్యాయి. వీరిలో ఐదుగురు బీజేపీ సభ్యులే కావ‌డం గ‌మ‌నార్హం.
  • 28 మందిపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. వీరిలో 21 మంది బీజేపీకి చెందిన వారేన‌ని ఏడీఆర్ పేర్కొంది. 16 మందిపై మహిళలకు సంబంధించిన నేరాలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. వీటిలో మూడు అత్యాచార కేసులు కూడా ఉన్నాయి.