వైసీపీ ఊహించ‌ని షాక్‌.. ఈసీ సంచ‌ల‌న ఆదేశాలు!

ఏపీలో అధికార పార్టీ వైసీపీకి కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌ల‌లో కూడా ఊహించ‌ని షాక్ ఇచ్చింది. కీల‌క‌మైన అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల వేళ‌.. వ‌లంటీర్ల‌ను అన్ని విధుల నుంచి త‌ప్పించాల‌ని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. వ‌లంటీర్ల‌తో అమలు చేస్తున్న పింఛ‌న్ల పంపిణీ స‌హా.. ఏ కార్య‌క్ర‌మానికీ అనుమ‌తులు ఇవ్వ‌ద్ద‌ని అధికారుల‌ను ఆదేశించింది. అస‌లు వ‌లంటీర్లు ఎవ‌రూ ఏ పనీ చేయ‌డానికి వీల్లేద‌ని పేర్కొంది. అంతేకాదు.. వారికి ప్ర‌భుత్వం ఇచ్చిన ఫోన్లు, ఫింగ‌ర్ ప్రింట్ డివైజ్‌లు.. ఇత‌ర‌త్రా వాహ‌నాలు వంటివాటిని కూడా వెంట‌నే వెన‌క్కి తీసుకోవాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఆదేశాలు త‌క్ష‌ణం అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని.. వ‌లంటీర్ల‌ను ఏ దశ‌లోనూ ఎక్క‌డా వినియోగించ‌రాద‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం పేర్కొంది. అంతేకాదు.. వ‌లంటీర్లు చేస్తున్న ప‌నుల‌కు సంబంధించి ప్ర‌త్యామ్నాయ ఏర్పాటుచేసుకునే బాధ్యత త‌మ‌ది కాద‌ని.. రాష్ట్ర ప్ర‌భుత్వానిదేన‌ని తేల్చి చెప్పింది. “వ‌లంటీర్ల‌ను పూర్తిగా ప‌క్క‌న పెట్టాల్సిందే. ఇప్ప‌టికే అనేక సంద‌ర్భాల్లో అనేక పిర్యాదులు అందాయి. వారిని ప‌క్క‌న పెట్టాల‌ని సూచించాం. అయినా.. అలా చేయ‌డం లేదు. ఇక‌, ఇప్ప‌టి నుంచి వ‌లంటీర్ల‌ను త‌క్ష‌ణ‌మే విధుల‌కు దూరంగా ఉంచండి. జూన్ 4వ తేదీ వ‌ర‌కు వారికి ఎలాంటి ప‌నులు అప్ప‌గించ‌వ‌ద్దు. వారు చేస్తున్న ప‌నుల‌ను వేరే వారికి అప్ప‌గించి చేయించుకునేలా ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేసుకోవాలి” అని కేంద్ర ఎన్నిక‌ల సంఘం పేర్కొంది.

ఇదేస‌మ‌యంలో నెల‌నెలా.. ఇంటింటికీ వాహ‌నాల ద్వారా అందిస్తున్న‌రేష‌న్ బియ్యాన్ని కూడా వ‌చ్చే మూడు మాసాలు(ఏప్రిల్‌, మే, జూన్ 4వ తేదీ) వ‌ర‌కు నిలిపివేయాల‌ని సూచించింది. దీనికి కూడా ప్ర‌త్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. దీంతో వైసీపీ ప్ర‌భుత్వానికి ఊహించ‌ని షాక్ త‌గిలిన‌ట్ట‌యింది. అయితే.. గ‌త కొన్నాళ్లుగా వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌పై ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న చేస్తున్నాయి. ఓట‌ర్ల‌ను వారు ప్ర‌భావితం చేస్తున్నార‌ని.. వారి వ‌ల్ల ఓట‌ర్లు ప్ర‌లోభాల‌కు గుర‌వుతున్నార‌ని టీడీపీ స‌హా వామ‌ప‌క్షాలు సైతం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోఅందిన అనేక ఫిర్యాదుల నేప‌థ్యంలో ఎన్నిక‌ల సంఘం తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. మ‌రి వైసీపీ ప్ర‌భుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.