గ‌డ‌బిడ‌లో జ‌న‌సేన‌.. 3 సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌ని ప‌వ‌న్‌!

జ‌న‌సేన పార్టీ గ‌డ‌బిడ‌లో ఉందా?  కూట‌మి పార్టీలైన టీడీపీ, బీజేపీల నుంచి తీసుకున్న సీట్లు త‌క్కువే(21) అయినా..ఇంకా పూర్తిస్థాయిలో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌లేదా? అంటే.. ఔననే అంటున్నారు జ‌న‌సేన నాయ‌కులు. ఇంకా మ‌రో ముగ్గురు అభ్య‌ర్థుల‌ను జ‌న‌సేన ప్ర‌క‌టించాల్సి ఉంది. దీంతో జ‌న‌సేన నాయ‌కులు ఏదో కిరికిరి జ‌రుగుతోంద‌నే వాద‌న వినిపిస్తున్నారు. అంతేకాదు.. తేడా వ‌స్తే.. పార్టీకి రాజీనామా త‌ప్ప‌ద‌ని కీల‌క నేత‌లు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలు కేటాయించారు.

అయితే, జనసేన పార్టీ ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 18 నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మ‌రో మూడు స్థానాలు అంటే..  విశాఖ సౌత్, అవనిగడ్డ, పాలకొండ సెగ్మెంట్లను పెండింగ్‌లో పెట్టింది. ఇదే సమయంలో జనసేన పోటీ చేసే బందరు పార్లమెంటు స్థానాన్ని కూడా పెండింగులో పెట్టారు. పెండింగ్‌లో ఉన్న సీట్లల్లో అభ్యర్థుల ఖరారుపై ఇప్పటి వరకు ఏటూ తేల్చుకోలేకపోతున్నారు. మూడు అసెంబ్లీ, ఓ లోక్ సభ సీటుపై ఇంకా క్లారిటీకి రాలేదు.. విశాఖ సౌత్, అవనిగడ్డ, పాలకొండ అసెంబ్లీ అభ్యర్థుల ఖరారపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సుదీర్ఘ కసరత్తు చేశారు.

అయినా ఇప్పటి వరకు అభ్యర్థుల పేర్లను ఫైనల్‌ చేసినట్టుగా కనిపించడంలేదు . మరో వైపు డైలామాలోనే బందరు పార్లమెంట్ సీటు వ్యవహారం ఉంది. వైసీపీ సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ.. ఇప్పుడు పవన్ కల్యాణ్ ఆయన పేరును ప‌క్క‌న పెట్టారు. అంగ బలం, అర్ధబలం ఉన్న అభ్యర్థుల కోసం జనసేనాని గాలిస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఇదే జ‌రిగితే.. తాను పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తాన‌ని.. ఇండిపెండెంటుగా పోటీ చేస్తాన‌ని బాల‌శౌరి చెబుతున్నారు.  

జనసేన విశాఖ దక్షిణ నియోజకవర్గం సీటు కూడా ఇబ్బందుల్లో ప‌డింది. ఈ టికెట్‌ నాదంటే నాదని ఇద్దరు నాయకుల మధ్య వార్‌ జరుగుతోంది. ఈ సీటును కార్పొరేటర్లు సాధిక్‌, కందుల నాగరాజులతో పాటు మూగి శ్రీనివాస్‌లు ఆది నుంచీ ఆశిస్తున్నారు. జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది.  సీటును తనకే ఖరారు చేశారంటూ వంశీకృష్ణ స్వయంగా ప్రకటించుకుని ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు. వంశీ అభ్యర్థిత్వంపై దక్షిణం సీటును ఆశిస్తున్న ఈ ముగ్గురు నేతలూ తీవ్రంగా మండిపడుతున్నారు.  

ఇలా చేస్తారా?

ప్ర‌స్తుతం ఉన్న జ‌న‌సేన నాయ‌కుల అంచ‌నా ప్ర‌కారం.. మూడు అసెంబ్లీ స్థానాల్లో జ‌న‌సేన ప్ర‌యోగాల‌కు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది.

+  అవనిగడ్డ సీటు కోసం విక్కుర్తి శ్రీనివాస్‌, బండి రామకృష్ణ, బండ్రెడ్డి రామకృష్ణ పోటీ పడుతున్నారు. వీరిలో ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో విక్కుర్తికే మొగ్గు ఉన్నట్లు తేలింది. కానీ టీడీపీ నుంచి  మండలి బుద్ద ప్రసాద్ ను చేర్చుకుని ఆయనకు టిక్కెట్ ఇవ్వాలని జ‌న‌సేన అధినేత భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇదే జ‌రిగితే ఓడిస్తామ‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు.  

+ పాలకొండకు ఆరుగురు పోటీ పడుతున్నారు. పార్టీలో కొంత మంది నాయకులు ఆ సీటు ఇప్పిస్తామని కొంత మందిని వెంట పెట్టుకుని పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఇలా ఎవరికి వారు పవన్‌ కల్యాణ్‌ను కలిసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ నుంచి విశ్వాసరాయి కళావతి పోటీ చేస్తున్నారు.