కీలకమైన అసెంబ్లీ ఎన్నికల వేళ.. జనసేన పార్టీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఒక వైపు పార్టీకి సెగ పెడుతోంది. మరోవైపు..పొరు గు పార్టీల నుంచి తీసుకున్న నాయకులకు టికెట్లు ఇవ్వడం మరింతగా ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి సమయంలో కీలకపరిణామం చోటు చేసుకుంది. అది కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. ఎన్నో ఆశలు పెట్టుకున్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నాయకుడు పితాని బాలకృష్ణ పార్టీ మారిపోతున్నారు. ఆయన గత రెండు రోజులుగా వైసీపీకి టచ్లో ఉన్నారు. అయితే.. ఈ విషయం తెలిసి కూడా జనసేన నుంచి ఎవరూ సానుభూతి చూపలేదు.
ఉమ్మడి తూర్పుగోదావరి(కోనసీమ) జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన కోఆర్డినేటర్ గా పితాని బాలకృష్ణ చాలా కాలం నుంచి పని చేస్తున్నారు. ఏ కార్యక్రమం జరిగినా.. ఆయన రూపాయికి వెనుకాడకుండా ఖర్చు పెట్టారు. గత నెలలోనే తన ఆస్తులు అమ్మి పార్టీ జెండాలు కట్టించానని.. తనకు సీటు ఇస్తారన్న ఆశ ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కానీ, ఆయనకు టికెట్ రాలేదు. దీంతో కొన్నాళ్లుగా ఆయన పార్టీ అధిష్టానం నుంచి బుజ్జగింపుల కోసం వేచి చూస్తున్నారు. కానీ, పార్టీ నుంచి ఎలాంటి సానుభూతి రాలేదు. పైగా.. పవన్కు ఎదురు చెప్పడానికి వీల్లేదంటూ.. ఈయనను ఉద్దేశించే పార్టీ కీలక ప్రకటన చేసిందనే ప్రచారం ఉంది.
ఈ నేపథ్యంలో ఆయన వైసీపీకి టచ్లోకి వెళ్లిపోయారు. తాజాగా జనసేనకు రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరుతున్నారు. పితాని బాలకృష్ణ వ్యక్తిగత ఎలా ఉన్నా.. రాజకీయంగా ఆయన గతంలో వైసీపీలోనే ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు ఆయన ముమ్మిడివరం వైసీపీ కోఆర్డినేటర్ గా ఉన్నారు. అయితే 2019లో పితానికి వైసీపీ టికెట్ నిరాకరించడంతో అప్పట్లో ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఆ ఎన్నికల్లో జనసేన నుంచి ఆయనకు టికెట్ వచ్చింది. కానీ, వైసీపీ హవాలో ఆయన ఓడిపోయారు.
తర్వాత పార్టీని గెలిపించుకునేందుకు జనసేన కోసం బాగానే కష్టపడ్డారు. ఒక్కొక్కసారి ఇంటికి కూడా వెళ్లకుండానే ఆయన జనసేన కార్యాలయంలో పడుకుని మరీ సేవ చేశారని ఆయన అభిమానులు, అనుచరులు చెబుతారు. అయితే.. ఇప్పుడు జనసేన టికెట్ నిరాకరించడంతో మళ్లీ వైసీపీలో చేరబోతున్నారు. జనసేనపై ఆయన ఇప్పటికే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పవన్ తనకు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. పొత్తులో భాగంగా ముమ్మిడివరం టీడీపీకి వెళ్లింది. దీంతో, రామచంద్రాపురం సీటుపై ఆయన ఆశలు పెట్టుకున్నారు. అక్కడ కూడా టికెట్ దక్కక పోవడంతో ఇక, పార్టీకి రాం రాం చెప్పారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన పితాని.. రెండు నియోజకవర్గాలు(రామచంద్రపురం, ముమ్మిడి వరం)లపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates