2వ ద‌శ ఎన్నిక‌ల‌ నోటిఫికేష‌న్.. రాహుల్ నియోజ‌క‌వ‌ర్గంలో అప్పుడే!

దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న లోక్‌సభ ఎన్నికల కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా  రెండవ దశ పోలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 7 ద‌శ‌ల‌లో జ‌రుగుతున్న ఈ ఎన్నిక‌లు కాంగ్రెస్‌, బీజేపీల‌కు ప్రాణ‌సంక‌టంగా మారింది. ఇక‌, తాజాగా విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్‌లోనే కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ నియోజ‌క‌వ‌ర్గం కూడా ఉంది. ఆయ‌న ఈ ద‌ఫా కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండోసారి పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే.

ఇక‌, ఏప్రిల్ 26న జరగనున్న ఓటింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను సీఈసీ తాజాగా విడుదల చేసింది. దీంతో నేటి నుంచి రెండో దశ నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ రెండో దశ పోలింగ్‌కు నామినేషన్ పత్రాలను ఏప్రిల్ 4వ తేదీ వ‌ర‌కు స్వీక‌రిస్తారు. ఈ రెండో ద‌శ‌లో జమ్మూ కశ్మీర్ మినహా మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఏప్రిల్ 5న నామినేషన్ పత్రాల పరిశీలన జరగనుంది. ఏప్రిల్ 6న జమ్మూ కశ్మీర్‌లో పరిశీలన జరగనుంది.

రెండవ విడతలో దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 88 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొదటి దశలో భాగంగా మార్చి 20న నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ ‘ఔటర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గం’లోని కొంత భాగంలో రెండో దశలో కూడా పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గం పరిధిలోని 15 అసెంబ్లీ స్థానల్లో ఏప్రిల్ 19న మొదటి దశలో పోలింగ్ జరగనుండగా.. మిగతా 13 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది.

రెండో ద‌శ‌లో పోలింగ్ జ‌రిగే

రాష్ట్రాలు-స్థానాలు

కేరళలో  – 20

కర్ణాటక – 14

రాజస్థాన్ – 13

మహారాష్ట్ర – 8

ఉత్తరప్రదేశ్ – 8

మధ్యప్రదేశ్ – 7

అసోం – 5

బీహార్ – 5

ఛత్తీస్‌గఢ్ – 3

పశ్చిమ బెంగాల్ –  3

మణిపూర్ -1

త్రిపుర-1

జమ్మూ కాశ్మీర్-1