వివేకా హ‌త్య‌పై సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

త‌న సొంత చిన్నాన్న‌, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి 2019లో దారుణ హ‌త్య‌కు గురైన విష‌యం తెలిసిందే. అయితే.. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. కోర్టుల్లో కేసు సుదీర్ఘ కాలం సాగినా.. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఒక్క‌మాట కూడా మాట్లాడ‌ని సీఎం జ‌గ‌న్ .. తాజాగా వివేకానంద‌రెడ్డి హ‌త్య‌పై సంచ‌ల‌న విమ‌ర్శ‌లు చేశారు.

“బాబాయ్‌ను ఎవరు చంపారో.. ఎవరు చంపించారో ఆ దేవుడికి కడప  జిల్లా ప్రజలకు బాగా తెలుసు. వివేకా చిన్నాన్నను అతిదారుణంగా చంపి.. అతిహీనంగా బహిరంగంగా ఆ హంతకుడు తిరుగుతున్నాడు. ఆ హంతకుడికి మద్దతు ఎవరిస్తున్నారో అంతా చూస్తున్నారు” అని అన్నారు.  

అంతేకాదు, “ఆ చంపినోడు ఉండాల్సినోడు జైల్లో.. నేరుగా నెత్తిన పెట్టుకుని మద్దతు ఇస్తోంది చంద్రబాబు, చంద్రబాబుకి సంబంధించిన వారే.  చంద్రబాబుకు రాజకీయ లబ్ధి కోసం తపించి పోతున్న ఒకరిద్దరు నా వాళ్లు కూడా హంత‌కుడికి స‌మ‌క‌రిస్తున్నారు. చిన్నాన్నను అన్యాయంగా చంపారు.  ఇంతటి దారుణం చేస్తూ నన్ను దెబ్బ తీసే రాజకీయం చేస్తున్నారు, ఇది కలియుగం కాకపోతే ఇంకేంటి?” అని జగన్ ప్రశ్నించారు.  

“ఇంత కన్నా అన్యాయం ఉంటుందా? మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిల్చొని.  ప్రజల మద్దతు లేని చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయం.. నేను మాత్రం ప్రజల పక్షం అని గర్వంగా చెబుతున్నా” అని వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న “మేం సిద్ధం” పేరుతో సీఎం జ‌గ‌న్ బ‌స్సు యాత్ర చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న బ‌స్సు నుంచే ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. అయితే.. ఫ‌స్ట్ టైం ఆయ‌న వివేకా హ‌త్య‌పై(సీఎం హోదాలో) స్పందించ‌డం గ‌మ‌నార్హం.